అమరావతి, జనవరి 22: కడప జిల్లా రాజంపేట తెలుగుదేశంపార్టీ శాసనసభ్యుడు మేడా మల్లికార్జున రెడ్డి వైసిపిలో చేరనున్నారు. మంగళవారం సాయంత్రం ఆయన వైసిపి అధినేత వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.
హైదరాబాద్లో వైసిపి అధినేతను ఆయన కలసి పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.
కాగా రాజంపేట నియోజకవర్గ తాజా పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో కడప జిల్లా నేతలు సమావేశమయ్యారు.
పార్టీ మారను అంటూనే మేడా రాయబారాలు నడిపారంటూ రాజ్యసభ సభ్యులు సిఎం రమేశ్ మీడియాతో అన్నారు. త్వరలో రాజంపేట నేతలకు చంద్రబాబు దిశానిర్ధేశం చేస్తారని ఆయన చెప్పారు.
కొంత కాలంగా రాజంపేట ఎమ్మెల్యే మేడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. కడప జిల్లా పార్టీ సమావేశానికి తనను ఆహ్వానించకుండా అవమానించారంటూ మేడా మంత్రి ఆదినారాయణరెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
పార్టీ మారుతున్నందునే సమావేశానికి ఆహ్వానించలేదని మంత్రి చెప్పారు. ఈ వివాదం ముఖ్యమంత్రి వద్దకు చేరింది. కడప జిల్లా పార్టీనేతలతో చంద్రబాబు మాట్లాడి త్వరలో నియోజకవర్గ బాధ్యుడిని ప్రకటించనున్నట్లు తెలిపారు.
previous post