అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాల్లో గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై టిడిపి సభ్యుడు, మాజీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ప్రతిగా జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ తీవ్ర స్థాయిలో లోకేష్పై విరుచుకుపడ్డారు.
16 నెలలు జైలులో ఉండి వచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి కావడం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమని లోకేష్ వ్యాఖ్యానించారు. దీనిపై అధికార పక్ష సభ్యులు తీవ్రంగా మండిపడ్డారు.
మాతృభాష సరిగా మాట్లాడటం రాని వారు కూడా మంత్రి పదవులు వెలగబెట్టారని అనిల్ కుమార్ విమర్శించారు. తాను పోటీ చేసిన నియోజకవర్గాన్ని సైతం మందలగిరి అని పిలిచిన ఘనుడు లోకేష్ అంటూ వ్యాఖ్యానించారు. జయంతిని వర్థంతిగా మాట్లాడి అభాసుపాలయ్యారని అనిల్ కుమార్ గుర్తు చేశారు. ముందు తెలుగు భాష నేర్చుకొని రావాలంటూ లోకేష్కు అనిల్ కుమార్ హితవు పలికారు. ఆయన తండ్రి ఓటుకు నోటు కేసులో తెలంగాణలో అడ్డంగా దొరికిపోయి హైదదరాబాదు నుండి పారిపోయివచ్చారని అనిల్కుమార్ విమర్శించారు. అర్థరాత్రి పూట చిదంబరం వద్దకు వెళ్లి కాళ్లు పట్టుకున్న రోజులు మరచిపోయారా అంటూ అనిల్ కుమార్ ప్రశ్నించారు. ఈ సమయంలో అధికార విపక్ష సభ్యుల వాగ్వివాదాలతో సభ గందరగోళంగా మారింది.