APSRTC : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య సమాచార గోడ కూడా అనేది ఏర్పడిపోయింది. తెలంగాణ వార్తలు తెలంగాణ లో…. ఆంధ్ర వార్తలు ఆంధ్ర ప్రదేశ్ లో రావడం తప్పించి పక్క రాష్ట్రంలో జరిగిన సంఘటన గురించి చెప్పడం మానేశారు. ఒక చోట ఉన్న తెలుగు ప్రజలకు పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి.
ఇదే క్రమంలో విజయనగరం జిల్లా పార్వతీపురం లో ఒక అమానుష ఘటన చోటుచేసుకుంది. విచక్షణారహితంగా…. మానవత్వం లేకుండా ప్రవర్తించిన ఆర్టీసీ సిబ్బందికి చివరికి ఏపీ మంత్రి పేర్ని నాని బుద్ధి చెప్పవలసి వచ్చింది. విషయం ఏమిటంటే… సాలూరు కు చెందిన పోలమ్మ తన భర్త పైడయ్యకు అనారోగ్యంగా ఉండటంతో వైద్యం కోసం పార్వతీపురం తీసుకెళ్లారు. తిరిగి వచ్చే సమయంలో ఆర్టీసీ బస్సు ఎక్కారు.
అయితే తిరిగి వస్తున్న బస్సులోనే ఆమె భర్త ప్రాణాలు విడిచారు. వెంటనే బస్సు సిబ్బంది, ప్రయాణికులు ఆమె భర్త శవాన్ని…. ఆమెను ఉన్నఫలంగా బస్సు ఆపేసి కిందకు దించేశారు. పెద్ద వయస్కురాలు కావడం వల్ల పోలమ్మ కూడా తిరిగి ఏమీ మాట్లాడ లేకపోయింది. కట్టుకున్న భర్త కళ్ళముందే చనిపోయిన తర్వాత పుట్టెడు శోకంలో ఆమె ఉంటే చుట్టూ ఉన్నవారు మానవత్వం మరిచి అలా అమానుషంగా ప్రవర్తిస్తూ అమెను, ఆమె భర్త డెడ్ బాడీ ని డ్రైనేజీ పక్కనే వదిలేసి వెళ్లిపోయారు, ఇక దారిన వెళ్తున్న ప్రతి ఒక్కరిని అర్థించిన ఆమె గోడు చివరికి మీడియాకు తెలిసింది.
వారు స్పందించి మిగిలిన వారికి సమాచారం ఇవ్వడంతో కొంతమంది మంచి వారి పుణ్యమా అని ఆమెను స్వగ్రామం పంపే ఏర్పాట్లు జరిగాయి. అంతే…. ఆ తర్వాత ఆర్టీసి వారిపై, సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. విషయం మీడియాలో ప్రముఖంగా రావడంతో మంత్రి పేర్ని నాని వెంటనే దీనికి రియాక్ట్ అయ్యారు. ఏపీ ఆర్టిసి ఎండి, వీసీలను పిలిచి మొత్తం జరిగిన విషయం గురించి ఆరా తీసి సంబంధిత అధికారులను వృద్ధురాలి ఇంటికి పంపారు. ఆమెను క్షమించామని కోరుతూ ఆ అధికారులు చెంపలేసుకుంటున్నారు.
అంతేకాకుండా ఇంకొకసారి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసే ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది ఇలా పక్క వారి పట్ల మానవత్వంతో వ్యవహరించకపోతే కఠినమైన చర్యలు ఉంటాయని మంత్రి నాని తెలిపారు. ఈ విషయానికి స్పందించి వెంటనే చర్యలు తీసుకోవడం పట్ల అతని పై రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.