Congress: ఎవరైనా ఒక నాయకుడు నేతల సమక్షంలో పార్టీ కండువా కప్పుకుంటే .. సదరు నేత ఆ పార్టీలో చేరినట్లే భావిస్తారు. కానీ.. తెలంగాణ కాంగ్రెస్ లో ఓ నాయకుడి దంపతులు పార్టీ కండువా కప్పుకున్నా పార్టీలో చేరినట్లు కాకుండా అయిపోయింది. సదరు నేత చేరిక వ్యవహారం వివాదాస్పదం కావడంతో పార్టీ కీలక నేత సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నా.. చేరికకు బ్రేక్ పడింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి వివిధ కారణాలతో పార్టీని వీడిన వారు తిరిగి వస్తామంటే చేర్చుకోవాలని రాష్ట్ర నాయకత్వానికి ఏఐసీసీ ఇటీవల ఆదేశించింది. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో గతంలో కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ చేరిన వారిలో కొందరు అధికార పార్టీలో ఉంటే సేఫ్ అని తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు.
ఈ క్రమంలోనే నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ భార్గవ్, ఆయన భార్య మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ నాగలక్ష్మి వారి అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కొద్ది రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వీరి చేరికను మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ లు వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం.
దీంతో భార్గవ్, ఆయన సతీమణి నాగలక్ష్మి, 13 మంది కౌన్సిలర్ లు శనివారం నేరుగా హైదరాబాద్ చేరుకుని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. అయితే తమకు సంప్రదించకుండా వీరిని పార్టీలో చేర్చుకోవడంపై జిల్లా కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆమె ఆదేశాల మేరకు చేరికలను తక్షణమే నిలుపుదల చేస్తున్నట్లు పీసీసీ కార్యనిర్వహణ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఒక ప్రకటన విడుదల చేశారు.
నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నాయకులతో సంప్రదింపులు జరిపిన తర్వాత చేరికల తేదీని ప్రకటిస్తామని, అప్పటి వరకూ భార్గవ్ చేరిక నిలుపుదలలోనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ పరిణామంతో భార్గవ్ దంపతులు జిల్లా నేతలను ప్రసన్నం చేసుకుని మరో సారి కాంగ్రెస్ కండువా కప్పుకోవాల్సిన విచిత్ర పరిస్థితి ఏర్పడుతోంది.