అమరావతి : గతంలో నియోజకవర్గాలలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్పిందే శాసనం, వారి మాటకు ఎదురు ఉండదు. అన్నీ వారి కనుసన్నల్లోనే జరుగుతుండేవి. దీన్ని ఆసరాగా చేసుకొని కొందరు నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు వివిధ రకాల అక్రమ వ్యాపారాలు, కాంట్రాక్టులలో చేతులు కలిపి అక్రమార్జన చేసిన వారు ఉన్నారు. ఇటువంటి పరిస్థితికి చరమగీతం పాడేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ఎవరి ప్రమేయం లేకుండా గ్రామ స్థాయిలో వాలంటీర్ వ్యవస్థ తీసుకువచ్చారు. వాలంటీర్ లు అధికార పార్టీ ఎమ్మెల్యే ల సిఫార్సులతో నియామకాలు జరిగినా చాలా ప్రాంతాలలో ఇప్పుడు ప్రభుత్వ విధి విధానాలకు అనుగుణంగా వారు పని చేస్తున్నారు. గ్రామ పాలనా వ్యవస్థలో వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది కీలకంగా మారడంతో ప్రజా ప్రతినిధుల సిఫార్సులు లేకుండానే సంక్షేమ పధకాలు లబ్దిదారులకు నేరుగా అందుతున్నాయి. ఈ పరిణామాలు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు రుచించడం లేదట. తమకు విలువ లేకుండా పోయిందని గ్రామ స్థాయి నాయకులు మొదలుకొని ఎమ్మెల్యేల వరకు కొన్ని ప్రాంతాలలో భాధపడుతున్నారుట.
దీనికి తోడు అధికారులు కూడా వాలంటీర్ల ద్వారా గ్రామాల్లో ఏమి జరుగుతుందో ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తుండటంతో పార్టీ అనుచరులు అక్రమ దందాలు చేయలేని పరిస్థితి ఏర్పడుతున్నదని వాపోతున్నారు. సంక్షేమ పథకాల అమలులో కులం, మతం, పార్టీ లు లాంటి భేధాలు చూడకుండా అర్హులందరికీ ప్రాధాన్యత ఇవ్వాలని పదే పదే సీఎం వైఎస్ జగన్ చెబుతుండటంతో టీడీపీ సానుభూతి పరులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, నగదు బదిలీలు అందుతున్నాయి.
మరో పక్క అక్రమ మద్యం, ఇసుక రవాణా సమాచారం కూడా పోలీసులు వాలంటీర్ల ద్వారా సేకరించి వాటిని అడ్డుకుంటున్నారు. ఇది అధికార పార్టీ నాయకులకు ఇబ్బందిగా మారింది. వాలంటీర్లు నిఘా నేత్రంగా పనిచేస్తుండటంతో అధికార పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులు భయపడుతున్నారట. అధికారంలోకి వచ్చినా ఎలాంటి లబ్ది పొందలేకపోతున్నామని క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు వాపోతున్నారుట. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షలు నిర్వహిస్తూనే పనిలో పనిగా తమ అనుచరులపై ఏమైనా అరా తీస్తున్నారా అంటూ మెల్లగా వాలంటీర్లను అడుగుతున్నారట.