ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న కీలక నిర్ణయాల్లో పాలనా వ్యవహారాల తో సంబంధం లేకుండా ఉన్న అతి ముఖ్యమైనది మన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా సంచయిత గజపతిరాజుని నియమించడం. మొదట్లో చాలా యుక్త వయసులో ఉన్న సంచయిత నియామకం పై విమర్శలు వచ్చినా ఆమె రోజురోజుకూ రాటుదేలుతున్న తీరు చూసి విపక్షాలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్పటికే ప్రతిపక్షం…. వైసీపీ నేతలు ఆమెను అడ్డంపెట్టుకుని మన్సాస్ భూములను కాజేయాలని చూస్తున్నారని విపరీతమైన వ్యాఖ్యలు చేశారు.
ఇన్ని రోజులు తనపై వస్తున్న ఆరోపణలపై ఓపిక ఉంచిన సంచయిత, ఈసారి చాలా ఘాటుగా స్పందించారు. గతంలో అశోక్ గజపతిరాజు ట్రస్ట్ భూముల పరిరక్షణ కోసం కనీసం లాయర్ కూడా నియమించలేదని మరియు మన్సాస్ క్యాంపస్ ను ఐఎల్ఎస్ఎఫ్ కు ఇచ్చేసి విద్యార్థులను షెడ్లో కి మార్చిన తీరుని గుర్తు చేస్తూ ఆమె విపరీతమైన కౌంటర్లు వేశారు.
అంతెందుకు మన్సాస్ చైర్మన్ గా అశోక్ గజపతిరాజు ఉన్నప్పుడు ట్రస్ట్ ను మరియు సింహాచలం దేవస్థానాన్ని అభివృద్ధికి ఏం చేశారో.. ఎలా చేశారో ప్రజల ముందు బహిరంగ చెప్పగలరా అని ఆమె సూటిగా ప్రశ్నించారు. తన బాబాయి ట్రస్ట్ ఆశయాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించిందని వ్యాఖ్యలు చేసిన ఆమె గత ప్రభుత్వం తన బాబాయి లాంటి వ్యక్తిని నియమించిందో అందరికీ తెలుసునని అన్నారు.
ఇంకా మోతీమహల్ని కూల్చివేసిన వారి గత చరిత్ర ఎత్తకపోవడం మంచిదని చెప్పిన ఆమె ఇవన్నీ ఎక్కడ బయట పడతాయో అన్న భయంతో ఆమె పై ఇష్టం వచ్చినట్లు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని అన్నారు. సంచయిత వేసిన ప్రశ్నలపై అశోక్ గజపతిరాజు సమాధానం ఇవ్వాల్సి ఉంది. సమాధానం ఇవ్వకపోతే మాత్రం ఆ ఆరోపణలు నిజమని ప్రజలు నమ్మే అవకాశం ఉంది.