Mukesh Ambani: ప్రపంచంలోని కుబేరుల వివరాలను హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2024 ను తాజాగా విడుదల చేసింది. ఇందులో ఆసియా దేశాల్లో మన భారత్ ప్రధాన భూమిక పోషించింది. భారత దేశం నుండి తాజాగా 94 మంది చేరికతో బిలియనీర్ల సంఖ్య 271కి పెరిగింది. ఈ జాబితాలో ముకేశ్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. గ్లోబల్ రిచ్ లిస్ట్ లో టాప్ టెన్ లో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయుడుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ (66) నిలిచారు.
వివరాల్లోకి వెళితే.. టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ 231 బిలియన్ డాలర్ల నికర సంపదతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా గత నాలుగేళ్లలో మూడోసారి అగ్రస్థానంలో నిలిచారు. ఇక ఇ – కామర్స్ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ 185 బిలియన్ల డాలర్ల సంపదతో రెండో స్థానంలో ఉన్నారు. ఎల్వీఎంహెచ్ సీఈవో బెర్నార్డ్ అర్నాల్ట్ 175 బిలియన్ నికర విలువతో మూడో స్థానానికి పడిపోయారు. ఇక మెటా సీఈవో మార్క్ జకర్ బర్గ్ 158 బిలియన్ల సంపదతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు.
ఒరాకిల్ చైర్మన్ లారీ ఎల్లిసన్ 144 బిలియన్ల డాలర్ల నికర విలువతో అయిదో స్థానంలో, బెర్క్ షైర్ హాత్వే చైర్మన్, వారెన్ బఫెట్ 144 బిలియన్ల నికర విలువతో ఆరో స్థానంలో నిలిచారు. అమెరికన్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్, ఇన్వెస్టర్ స్టీవ్ బాల్మెర్ 143 బిలియన్ తో ఏడో స్థానంలో, అదే విధంగా మైక్రో సాఫ్ట్ మాజీ సీఈవో బిల్ గేట్స్ 138 బిలియన్ డాలర్ల నికర విలువతో ఎనిమిదో స్థానంలో నిలిచారు. గుగుల్ మాజీ సీఈవో లారీ ఫేజ్ 123 బిలియన్ ల నికర విలువతో తొమ్మిదో స్థానంలో నిలిచారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ మరియు ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ముఖేశ్ అంబానీ 115 బిలియన్ల నికర విలువతో పదో స్థానంలో నిలిచారు.
Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై