Mumbai: భారత దేశంలో ధనవంతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పలువురు బడా పారిశ్రామిక వేత్తలు తమ సంపదను పెంచుకుంటూ ప్రపంచ కుబేరుల జాబితాలో తమ ర్యాంక్ ను కూడా మెరుగుపర్చుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బిలియనీర్ల జాబితాలో కూడా భారత్ .. చైనాను ఒక విషయంలో దాటేసింది. ఆసియా బిలియనీర్ క్యాపిటల్ గా తొలి సారి బీజింగ్ ను దాటేసింది భారత ఆర్ధిక రాజధాని ముంబై. ముంబైలో మొత్తం 92 మంది బిలియనీర్లు ఉన్నారు. ఈ సంఖ్య బీజింగ్ లో 91గా ఉంది. ఈ మేరకు తాజాగా హూరూన్ రీసెర్చ్ 2024 గ్లోబల్ రిచ్ లిస్ట్ జాబితాను విడుదల చేసింది.
హూరూన్ రీసెర్చ్ 2024 గ్లోబల్ రిచ్ లిస్ట్ ప్రకారం .. చైనాలో మొత్తం 814 మంది బిలియనీర్ లు ఉండగా, భారత్ లో కేవలం 271 మంది బిలియనీర్లు మాత్రమే ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా చూసినట్లయితే అత్యధిక బిలియనీర్ లు కల్గిన జాబితాలో న్యూయార్క్ 119 మంది బిలియనీర్లతో తొలి స్థానంలో ఉండగా, 97 మంది బిలియజనీర్ల తో లండన్ రెండో స్థానంలో ఉంది. ఇక ముంబై ఈ లిస్ట్ లో 92 మంది బిలియనీర్లతో మూడో స్థానంలో నిలిచింది. ప్రపంచంలో మూడవ స్థానానికి మరియు ఆసియా బిలియనీర్ రాజధానిగా ముంబై నిలిచింది. న్యూఢిల్లీ మొదటి సారిగా టాప్ టెన్ లోకి ప్రవేశించింది.
హూరూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ ప్రకారం ఈ ఏడాది ముంబై లో కొత్తగా 26 మంది బిలియనీర్లు వచ్చి చేరారు. స్టెర్లింగ్ ఇన్వెస్ట్ మెంట్స్ యజమాని రోహికా సైరన్ మిస్త్రీ, పెయింట్ తయారీ సంస్థ ఏషియన్ పెయింట్స్ కు చెందిన ఇనా అశ్విన్ డానీ ఈ జాబితాలో కొత్తగా ప్రవేశించిన వారిలో ఉన్నారు. ఇక ఇదే సమయంలో బీజింగ్ మాత్రం 18మంది బిలియనీర్లను కోల్పోయింది. ఇక ముంబైలోని మొత్తం బిలియనీర్ల సంపద ఏకంగా 47 శాతం పెరిగి 445 బిలియన్ డాలర్లుకు చేరుకుంది. ఇది భారత కరెన్సీ ప్రకారం రూ.37 లక్షలకోట్లకుపైనే ఉంటుంది. మరో వైపు బీజింగ్ లోని మొత్తం బిలియనీర్ల సంపద 28 శాతం పడిపోయి 265 బిలియన్ డాలర్లకు పతనమైంది. ఇది భారత కరెన్సీలో చూసినట్లయితే రూ.22 లక్షల కోట్లుగా ఉంది.
ముంబైలో ఎక్కువగా సంపద ముకేశ్ అంబానీ దగ్గరే ఉంది. ఏడాది వ్యవధిలో చూసినా ఆయన సంపదే ఎక్కువగా పెరిగింది. ఎనర్జీ, ఫార్మాష్యూటికల్స్ వంటి రంగాల్లో సంపద సృష్టి ఎక్కువగా జరిగింది. ఇక ఏడాదిలో బిగ్గెస్ట్ వెల్త్ గెయినర్ గా రియల్ ఎస్టేట్ దిగ్గజం మంగళ్ ప్రభాత్ లోధాదే. ఇది 116 శాతం పెరిగింది. ప్రపంచ కుబేరుల జాబితాలో భారతీయుల సంఖ్య కాస్త తగ్గినప్పటికీ .. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మాత్రం పదవ స్థానంలో ఉన్నారు. ఇటీవలి కాలంలో ఆయన సంపద పెరగ్గా.. ఆయన ర్యాంక్ కూడా మెరుగుపడిందని చెప్పవచ్చు. ఇక ఆదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ ఆదానీ 15వ స్థానంలో కొనసాగుతున్నారు.
YSRCP: అనకాపల్లి ఎంపీ అభ్యర్ధిని ప్రకటించిన సీఎం జగన్