పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎన్నికలకు 50 రోజులకు ముందే అధికార వైసీపీ పూర్తిగా చేతులు ఎత్తేసి కాళ్లు ఆరజాపేసుకుని కూర్చున్నట్లుంది. గత ఎన్నికల్లో అంతటి వైసీపీ వేవ్లోనే పేటలో అప్పటి మంత్రి ప్రత్తిపాటి పుల్లరావు కేవలం 8 వేల ఓట్లతో ఓడిపోయారు. కట్ చేస్తే ఐదేళ్లలో ప్రస్తుత మంత్రి విడదల రజనీ ఇక్కడ పోటీ చేస్తే కనిష్టంగా 30 – 40 వేల ఓట్లతో ఓడిపోవడం ఖాయమన్న నివేదికలు ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో జగన్ టేబుల్ మీదకు వెళ్లిపోయాయి.
పైగా రజనీ మంత్రి.. జగన్కు ఇష్టురాలన్న పేరుంది. ఆమెను ఎలాగైనా సేవ్ చేయాలనే తొలి జాబితాలోనే గుంటూరు వెస్ట్ సీటుకు మార్చేశారు. రజనీకి కూడా పేటలో ఇప్పుడు గ్రౌండ్ రిపోర్ట్ తెలుసు.. లేకపోతే ఆమె పేట అంత సలువుగా ఎందుకు వదులుకుంటుంది.. ఆమె గుంటూరు వెస్ట్కు వెళతా.. వెళతా.. తన బంధువు, తన ఫాలోయిన్ అని ఆమె స్వయంగా చెప్పుకుని.. పట్టణంలో తన పురుషోత్తపట్నం ప్రాంతానికే చెందిన మల్లేల రాజేష్ నాయుడికి సీటు ఇప్పించుకుని వెళ్లింది.
ఒక నెల బాగానే నడిచింది. తర్వాత రజనీతో రాజేష్కు ఎక్కడో చెడింది. రాజేష్ ఫైర్ అయిపోయాడు. రజనీ తన దగ్గర ఏకంగా రు 6.5 కోట్లు టిక్కెట్ కోసం తీసుకుందని.. తర్వాత సజ్జలకు చెపితే ఓ రు. 3 కోట్లు వచ్చాయ్.. మరో రు 3.5 పోయాయ్ అని లబోదిబోమనేశాడు. వెంటనే రజనీ పై స్థాయి లాబీయింగ్ వాడేసి రాజేష్ను తప్పించేసి గుంటూరు మేయర్ కావటి మనోహర్నాయుడుకు పేట వైసీపీ ఇన్చార్జ్ పగ్గాలు ఇప్పించేలా చేసింది.
పేటలో మూడు, నాలుగు ముక్కలుగా చీలిన వైసీపీ…
నెలన్నర రోజుల్లో పేటకు ముగ్గురు వైసీపీ ఇన్చార్జ్లు మారడంతో వైసీపీ ముక్కలు చెక్కలు అయిపోయింది. విడదల రజనీది ఓ వర్గం, రాజేష్ నాయుడిది మరో వర్గం.. ఇప్పుడు మనోహర్ నాయుడు ఇన్చార్జ్గా రావడంతో ఆయన దగ్గర భజన చేసే బ్యాచ్ మరో వర్గంగా ఉంది. ఇక సీనియర్ నేత, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్కు నియోజకవర్గం అంతా పాత వర్గం ఉండనే ఉంది. వీరిలో ఏ వర్గం ఎవ్వరికి సహకరించే పరిస్థితి లేదు. వీళ్లంతా కూడా ఒకరికి ఒకరు వెన్నుపోట్లు పొడుచుకుంటూ వైసీపీని ఇక్కడ టీడీపీ ఓడించక్కర్లేదు.. వైసీపీయే చిత్తుగా ఓడించుకునే పనిలో బిజీగా ఉంది.
టీడీపీకే మా ఓటు.. మర్రికి తేల్చిచెప్పిన పల్లె ప్రజానీకం…
ఒక ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ మాత్రం పార్టీకి కమిట్మెంట్గానే ఉన్నారు. అయితే పల్లెల్లో ఉన్న ఆయన వర్గం మాత్రం మీకు, మాకు అన్యాయం జరిగింది. ఈ సారి మీరు పోటీ చేస్తే ఓట్లు అడగండి.. మేం మాత్రం మా నిర్ణయంలో ఉన్నాం అంటూ పరోక్షంగా టీడీపీకే సపోర్ట్ చేస్తామని చెప్పడంతో ఆయన సైతం ఏం చెప్పలేని పరిస్థితి ఉందట. ఇటు టీడీపీలో ఉన్న వర్గాలు ఏకతాటిమీదకు వచ్చేసి కసితో పని చేస్తుంటే వైసీపీ చీలికలు పీలికలు అయిపోయింది.
పుల్లారావు మెజార్టీ ఎంతంటే..
ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఫస్ట్ భారీ మెజార్టీతో గెలిచే సీటు చిలకలూరిపేట అన్న టాక్ బాగా స్ప్రెడ్ అయిపోయింది. పుల్లారావు మెజార్టీ ఎంత వస్తుందనేదానిమీదే జిల్లాలో బెట్టింగులు జోరుగా నడుస్తున్నాయి. 20 వేల నుంచి మొదలు పెట్టి 30, 35 ఇది 40 దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని కూడా లెక్కలు వేస్తున్నారు. మామూలుగా 20 వేల మెజార్టీ మీద పందాలు దొరకని పరిస్థితి ఉందంటే పేటలో పుల్లారావు వార్ ఎంత వన్సైడ్ అయిపోయిందో స్పష్టంగా తెలుస్తోంది.