దేశరాజకీయాల్లో బీజేపీ ద్వయం మోడీ – అమిత్ షాల ఎత్తులు పైఎత్తులు మామూలుగా ఉండవు! ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతారు.. ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గుతారు.. ఆ లాజిక్కులు, పట్టు విడుపులు బాగా తెలిసినవారు కాబట్టే.. రెండు సార్లు భారీ మెజారిటీ తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దేశాన్ని పరిపాలిస్తున్నారు! దేశాన్ని అయితే పాలిస్తున్నారు కానీ… వారి బలం అంతా ఉత్తర భారతదేశంలోనే అనడంలో సందేహం లేదు!
దక్షిణ భారతదేశంలో వారికన్నా మేధావులు స్థానిక పార్టీ అధినేతలుగా ఉండటం వల్లో ఏమో కానీ… వారికి దక్షిణ భారతం మాత్రం కొరకరాని కొయ్యగానే మారిందని చెప్పాలి! ఆ క్రమంలో ప్రస్తుతానికి కర్నాటకలో యాడ్యురప్పను పెట్టి “మమ” అని పిస్తున్నా… అది వాపే తప్ప బలం కాదన్న విషయం మిగిలివారికంటే బీజేపీ పెద్దలకే బాగా తెలుసు. సరే.. వాపో బలుపో.. పైకి అయితే ఉబ్బింది కదా అని ప్రస్తుతానికి ఉబ్బితబ్బిబై గడిపేస్తున్నారు! అనంతరం వారి టార్గెట్ తమిళనాడు అనే చెప్పుకొవాలి. ఎందుకంటే… 2021 లో తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి.. కాషాయ ద్వయం కాన్సంట్రేషన్ మొత్తం ఇప్పుడు తంబీలపైనే ఉంది! అందులో భాగంగా.. గత కొంతకాలం నుంచి తమిళనాడులో ఉన్న పెద్ద తలకాయలను, వారి ఫ్యామలీలను టార్గెట్ చేసి, పదవుల ఆశచూపి.. వలలో వేసుకుంటుంది బీజేపీ అధిష్టాణం!
ఇందులో భాగంగానే… ఎంజీఆర్ దత్తపుత్రిక గీతాను బీజేపీలో చేర్చుకోవడం.. అనంతరం ఆమెకి కీలకపదవి కట్టబెట్టడం జరిగిపోయాయి. అక్కడితో ఎంజీఆర్ ఫ్యాన్స్ మనసు దోచుకున్నామని ఫీలవుతున్న బీజేపీ… గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కుమార్తె విద్యారాణి ని పార్టీలో చేర్చుకుని, ఆమెను తమిళనాడు యువమోర్చ విభాగం ఉపాధ్యక్షురాలిని చేసేసింది. ఆపని కూడా అయిన అనంతరం తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్ ఓట్లను కొల్లగొట్టే క్రమంలో… రజనీ అల్లుడు హీరో ధనుష్ తండ్రి కస్తూరి రాజాను బీజేపీలో చేర్చుకోవడంతో పాటు పార్టీలో కీలకపదవి ఇచ్చారు. అనంతరం ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సోదరుడు గంగై అమరన్ కు బీజేపీలో కిలకపదవి కట్టబెట్టారు. ఇలా తమిళనాడుకు చెందిన మరికొంతమంది ప్రముఖులకు కూడా బీజేపీలో సముచిత స్థానం కల్పించారు.
తమిళనాడులో కాబట్టి వీరందరికీ చిన్నవో పెద్దవో పదవులు కట్టబెట్టారు బీజేపీ పెద్దలు! మరి నెక్స్ట్ టార్గెట్.. తెలుగు రాష్ట్రాలు.. అందునా ఏపీ అయితే… బీజేపీ ఎవరికి పదవి కట్టబెట్టబోతోంది? ప్రస్తుతం ఏపీలో జగనే “కీ” కాబట్టి… ఇస్తే గిస్తే జగన్ కే ఇవ్వాలి! మరి…జగన్ కు ఇచ్చేటంత పెద్ద పదవి బీజేపీ దగ్గర ఉందా.. అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న! సపోజ్, ఫర్ సపోజ్.. ఉండి, ఇస్తే జగన్ తీసుకుంటారా? ఈ విషయంలో… ఎంత విశ్లేషకులైనా మరీ అంత ఊహాగాణాలు పరినిరావని అంటున్నారు ఏపీ వాసులు!!