Sarkaru vaari paata: తాజాగా టాలీవుడ్ సినిమాలన్నీ కొత్త రిలీజ్ డేట్స్ను ప్రకటించాయి. వీటిలో ఎన్.టి.ఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఆర్ఆర్ఆర్, చిరు – చరణ్ల ఆచార్య, పవన్ కళ్యాణ్ – రానాల భీమ్లా నాయక్, వెంకటేశ్ – వరుణ్ తేజ్ల ఎఫ్ 3 సినిమాలున్నాయి. వీటితో పాటు సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన సర్కారు వారి పాట సినిమా కూడా ఉంది. అందరూ ఏప్రిల్ లోపే తమ సినిమాల విడుదల తేదీలను ఫిక్స్ చేసుకున్నారు. కానీ, మహేశ్ బాబు ఒక్కడే కాస్త దూరంగా సోలో డేట్ చూసుకొని మే 12న తమ సర్కారు వారి పాట సినిమాను రిలీజ్ చేస్తామని అధికారికంగా సరికొత్త పోస్టర్ను వదిలి ప్రకటించారు.
అయితే, మిగతా ఏ సినిమాకు కొత్త రిలీజ్ డేట్ విషయంలో అభిమానులకు ఎలాంటి అభ్యంతరాలు కలగలేదు. కానీ, మహేశ్ అభిమానులు మాత్రం మే అంటే ససేమిరా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారట. ఎందుకంటే మన మహేశ్కు మే నెల అంతగా కలిసి వచ్చింది లేదు. ఆయన నటించిన చిత్రాలు కొన్ని మే నెలలోనే వచ్చి ఫ్లాప్ను మూటగట్టుకున్నాయి. ఈ కారణంగానే అభిమానులు ఆయనను అనవసరంగా మే నెలలో సర్కారు వారి పాట రిలీజ్ డేట్ను అనౌన్స్ చేశారని కామెంట్స్ చేస్తున్నారట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు ఖుషీ రూపంలో ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన ఎస్.జే. సూర్య మహేష్ హీరోగా ‘నాని’ చిత్రాన్ని తెరకెక్కించగా 2004 మే 14న విడుదలై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.
Sarkaru vaari paata: బ్యాడ్ సెంటిమెంట్ బ్రేక్ చేయడానికి అదే తేదీన వస్తారా..?
ఇక మహేష్ బాబు హీరోగా తేజ రూపొందించిన ‘నిజం’ అనే సినిమా కూడా 2003 మే 23న విడుదలై ఫ్లాప్ గా మిగిలింది. అలాగే, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ నటించిన ‘బ్రహ్మోత్సవం’ కూడా భారీ అంచనాలతో 2016 మే 20న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘోర పరాజయాన్ని చూసింది. అందుకే మహేశ్కు మే నెల కలిసి రాదని ఓ బ్యాడ్ సెంటిమెంట్ అభిమానుల్లో ఉంది. ఇప్పుడు అదే మే నెలలో 12వ తేదీన సర్కారు వారి పాట సిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించగానే అభిమానుల్లో ఆందోళన మొదలైందని చెప్పుకుంటున్నారు. మరి అభిమానుల కోరిక మేరకు సర్కారు వారి పాట రిలీజ్ డేట్ మారుస్తారా లేదా బ్యాడ్ సెంటిమెంట్ బ్రేక్ చేయడానికి అదే తేదీన వస్తారా చూడాలి.