Union Bidget 2022: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఏపీకి ఒరిగిందేమన్నా ఉందా అంటే.. ఏమీ లేదనే చెప్పాలి. అసలు రాష్ట్రాల ప్రాతిపదికన ఇచ్చిందే లేదని చెప్పాలి. గత బడ్జెట్ లో రాష్ట్రాలవారీగా ఏమిస్తారో చెప్పేవారు. కానీ.. ఈసారి అలా కాకుండా తాము చేయాలనుకుంటున్నవే చెప్పారు ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్. అయితే.. ఈ బడ్జెట్ లో ఏపీకి తీపి కబురులాంటిది మాత్రం ఒకటుంది. రాష్ట్రాల కోసం లక్ష కోట్లతో ఒక నిధి ఏర్పాటు చేస్తామని చెప్పారు. అంటే.. ఆ నిధి ద్వారా వడ్డీ లేని రుణం తీసుకోవచ్చు. సంక్షేమ పాలన కోసం అప్పులు చేసే ఏపీకి ఈ నిధి వరమే అనే కామెంట్స్ వస్తున్నాయి. అయితే.. మొత్తంగా ఏపీని ప్రత్యేకంగా చూడటం కాదు కదా.. ఇవ్వాల్సినవే ఇవ్వలేదని చెప్పాలి.
ఏపీ వైపు చూడని కేంద్రం..
విభజిత రాష్ట్రంగా ఏపీకి గతంలో ఇచ్చిన హామీలెన్నో ఈ బడ్జెట్ లో కూడా నెరవేరలేదు. కృష్ణా–గోదావరి, కృష్ణా–పెన్నా నదుల అనుసంధానం విషయంలో ఒక ప్రాజెక్టు రూపొందించామని చెప్పడం ఊరటనిస్తున్నా.. కేటాయింపులు చెప్పలేదు. జాతీయ హోదా ఉన్న పోలవరం ప్రాజెక్టుకు ఎంతోకొంత నిధులు కేటాయించాల్సిందే. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీతో పునరావాసానికే 27వేల కోట్లు అవసరం. ఆ ప్రస్తావనే లేకపోవడంతో 2022 జూన్ కల్లా పోలవరం ద్వారా నీళ్లిస్తామన్న సీఎం జగన్ హామీ నెరవేరడం కష్టమే. రైల్వే జోన్ సంగతి సరేసరి. రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చేందుకు కూడా ఏమీ కేటాయించలేదు. విశాఖ మెట్రో ప్రస్తావనే లేదు. జల రవాణా గురించి చెప్పలేదు.
ఎంపీలు సాధిస్తారా..
మెడికల్ కాలేజీల నిర్మాణానికి కూడా ఎంత కేటాయించిందీ చెప్పలేదు. సుదీర్ఘ తీర ప్రాంతమున్నా పోర్టుల ప్రస్తావనే లేదు. వెనుకబడిన జిల్లలకు కేటాయించే నిధులు లేవు. మొత్తంగా ఏపీకి ఈ బడ్జెట్ లో కూడా నిధులు లేవు. మొత్తంగా రాష్ట్రానికి ఎప్పటిలా అన్యాయం జరిగిందనేది వాస్తవం. బడ్జెట్ పై సీఎం జగన్, ఎంపీలు ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే సీఎం వద్ద ఈ అంశంపై చర్చించారని తెలుస్తోంది. రేపటి నుంచి బడ్జెట్ పై జరిగే చర్చలో వైసీపీ ఎంపీలు నిరసన తెలుపుతారా..? బడ్జెట్ ను స్వాగతిస్తారా..? లేదంటే.. రాజ్యసభలో వైసీపీకి బలం ఉంది. అక్కడ వైసీపీ ఎదురు తిరిగితే బీజేపీకి షాక్ తప్పదు. అలా చేేసి ఏపీకి రావాల్సిన వాటిని సాధిస్తారా..? చూద్దాం..!!