ప్రస్తుతం వైకాపాలో రఘురామకృష్ణం రాజు మామూలు సంచలనం కాదు! గతకొన్ని రోజులుగా వరుసపెట్టి తన ప్రతాపాన్ని దశలవారీగా ప్రభుత్వంపైనా, పార్టీపైనా చూపిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో రఘురామకృష్ణంరాజుపై వైకాపా ఎమ్మెల్యేలు, మంత్రి రంగనాథరాజు లు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ కేసుల కార్యక్రమాన్ని పిల్ల చేష్టలుగా అభివర్ణించిన ట్రిపుల్ ఆర్… హిందూ – క్రీస్టియన్ అనే విషయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు… తాను చెప్పిన “పందులే గుంపులుగా వస్తాయి” అన్న డైలాగ్ పై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు!
రఘురామకృష్ణం రాజు పార్టీపై ఎర్ర జెండా ఎగరేసిన సమయంలో… ఆయన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేలు మైకుల ముందుకువచ్చి తనను విమర్శించిన సందర్భంలో… “పందులే గుంపులుగా వస్తాయి… సింహం సింగిల్ గా వస్తాది” అంటూ రజనీకాంత్ సినిమాలోని డైలాగ్ ని పేల్చారు. ఈ విషయంలో ఆ ఐదుగురు వైకాపా ఎమ్మెల్యేలను పందులతో పోల్చారని.. తనను తాను సింహంతో పోల్చుకున్నారనే విషయం చిన్నపిల్లాడిని అడిగినా చెబుతారనే కామెంట్లు వచ్చాయి. తాజాగా ఆ విషయంపై స్పందించిన ఆర్.ఆర్.ఆర్… ఆ డైలగ్ తమ పార్టీ స్లోగన్ అని.. ఎన్నికల సమయంలో జగన్, షర్మిళలు నిత్యం ఈ స్లోగనే చెప్పేవారని… అంతకు మించి అందులో మరో ఉద్దేశ్యం లేదని చెప్పుకొచ్చారు!
అనంతరం తనపై కేసులకు, జరుగుతున్న దాడులకు కారణం తాను తిరుమల భూముల విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే అని… తనపై క్రైస్తవ వ్యతిరేకి అనే ముద్ర వేస్తున్నారని… తనకున్న ధైర్యం తాను నమ్ముకున్న వెంకటేశ్వర స్వామి అని.. తన వెనుక 80% హిందువుల మనోబావాలు ఉన్నాయని… ఆ ధైర్యంతోనే ముందుకు వెళ్తున్నాని చెప్పుకొస్తున్నారు!!
ఉన్నఫలంగా రఘురామకృష్ణంరాజు ఇలా తాను పక్కా హిందూ ని అని… తనవెనుక 80%మంది హిందువులు ఉన్నారని… వెంకటేశ్వర స్వామి భూముల కోసం తాను ప్రభుత్వాన్ని ప్రశ్నించడం నేరమా అంటూ వ్యాఖ్యలు చేయడాన్ని… బీజేపీకి దగ్గరవ్వడానికి ఆయన ఎత్తుకున్న మరో పాయింట్ అని పలువురు బీజేపీ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు! ఇదే సమయంలో ఎస్సీ, బీసీ, ఓసీ కోటాలో సీట్లు సంపాదించుకుని, అనంతరం ప్రతీ ఆదివారం చర్చికి వెళ్లే నేతలపై చర్యలు తీసుకోవాలని.. వారిపై నిఘా పెట్టాలని.. అది నేరమని చెప్పుకొచ్చారు!
దీంతో… ఉన్నఫలంగా క్రీస్టియానిటీ.. హిందూ వంటి టాపిక్ లు తెరపైకి తేవడంపై రఘురామ కృష్ణంరాజు నెక్స్ట్ స్టెప్ పై ఇంతకన్నా క్లారిటీ ఇచ్చేది ఏమీ లేదని అంటున్నారు విశ్లేషకులు!