ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే అన్నీ దేశాల్లో కలిపి దాదాపు ఐదు కోట్ల మందికి పైగా ప్రజలు ఈ వైరస్ బారినపడ్డారు. వీరిలో సుమారు 12 లక్షలకు పైగా మందిని కరోనా మహమ్మారి బలితీసుకున్నది. రోజురోజుకూ తన ప్రభావాన్ని పెంచుకుంటున్న కోవిడ్-19 తీవ్ర స్థాయిలో వ్యాపిస్తున్నది. ఈ నేపథ్యంలోనే కరోనా కట్టడి కోసం సైంటిస్టులు ముమ్మరంగా పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటికే కరోనాకు అడ్డుకుట్ట వేయడంలో అభివృధ్ధి చేసిన పలు వ్యాక్సిన్లు చివరి దశ క్లినికల్ ట్రయల్స్ జరుపుకుంటున్నాయి. ఇది కాస్త ఊరట కలిగించే అంశం.
అయితే, కరోనా వైరస్ పై చేస్తున్న పరిశోధనల్లో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తూనే ఉంది. ఇప్పటికే సైంటిస్టులు కరోనాపై పలు ఆందోళన కలిగించే అంశాలను గుర్తించారు. వాటిలో ఒక్కో దేశంలో ఒక్కో విధమైన కరోనా వైరస్ ఉత్పరివర్తనం (జన్యుపరమైన మార్పు చెందడం) చెంది మనుషులపై ప్రభావం చూపుతోంది. ఇలా మార్పు చెందిన కరోనా మహమ్మారిలు దాదాపు వేల రకాలు ఉన్నాయని గుర్తించారు. ఇలా మనుషుల నుంచి మనుషులకు వ్యాపించే క్రమంలో పెద్దగా తేడాలు ఏమి చూపలేదు.
కానీ, తాజాగా కరోనా వైరస్ తన విశ్వరూపాన్ని చూపుతూ.. మనవ మనుగడకు సవాలు విసురుతోంది. మనుషులకే కాకుండా జంతువులకు సైతం వ్యాపిస్తోంది ఈ వైరస్. ఇలా జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే క్రమంలో ఉత్పరివర్తనం చెంది మరింత భయానకంగా మారుతోందని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మింక్స్ లోకి ప్రవేశించిన కరోనా మహమ్మారి.. పలు మార్పులు చేసుకుని వాటి నుంచి మనుషులకు వ్యాపిస్తోంది. చాలా దేశాల్లో దీనిని గుర్తించారు. డెన్మార్క్ లో అయితే భారీ స్థాయిలో మంక్స్ నుంచి మనుషులకు వైరస్ సోకుతోంది. దీంతో అక్కడి సర్కారు.. వాటిని పేంచే కేంద్రాల్లో ఉన్న దాదాపు 1.7 కోట్ల మంక్స్ ను చంపేయాలని ఆదేశించడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది.
ఈ రకమైన వైరస్ ను అడ్డుకోవడంలో ఇప్పటికే చివరి దశకు చేరిన వ్యాక్సిన్ల ప్రభావం చూపకపోవచ్చునని సైంటిస్టులు అభిప్రాయపడుతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్త మవుతోంది. దీనిపై ఆస్ట్రేలియాలో కరోనా పరిశోధనలకు నాయకత్వం హిస్తున్న భారత సంతతి సైంటిస్టు శేషాద్రి వాసన్ మాట్లాడుతూ.. కోవిడ్-19 ఈ కొత్త ఉత్పరివర్తనకు వై453ఎఫ్ పేరు పెట్టామన్నారు. ఇది ఆర్ ఎన్ ఏ వైరస్ అనీ, ఇది నిరంతరం మార్పులు చేసుకుంటూ.. తన రక్షణ వ్యవస్థను బలంగా మార్చుకుంటుదని తెలిపారు.
భారత్లో ఈ రకం వైరస్ ఉత్పరివర్తనం ఇంకా జరగలేదనీ, దీని పై ప్రస్తుత టీకాలు ప్రభావం చూపుతాయా ? లేదా? అనే దానిపై పరిశోధనలు సాగిస్తున్నామని తెలిపారు. మొదట అమెరికా, డెన్మార్క్ దేశాల్లో దీనిని గుర్తించామన్నారు. మానవుల్లోకి ప్రవేశించడానికి ఈ వైరస్ ఉపయోగించుకునే స్పైక్ ప్రోటిన్ లో మార్పు చోటుచేసుకోవడం ఆందోళన కలిగించే విషయమని తెలిపారు.