పాతబస్తీ కేంద్రంగా ఎదుగుతున్న ఏఐఎంఐఎం పార్టీ కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంటోంది. ఇప్పటికే తెలంగాణలోని ముస్లిం ప్రభావిత నియోజవర్గాల్లో కేవలం తమ పార్టీ మాత్రమే గెలిచేలా వ్యూహం అమలు చేస్తున్న ఆ పార్టీ ఇటీవల బీహార్కు సైతం విస్తరించింది.
బీహార్ ఎన్నికలలో ఐదుగురు ఎమ్మెల్యేలు గెలిచిన సంగతి తెలిసిందే. బీహార్ ఎన్నికలలో గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీ అధినేత అసదుద్దీన్తో భేటీ అయ్యారు. అనంతరం ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్తో సమావేశం అయ్యారు. అనంతరం పార్టీ నేతలతో కీలక వ్యాఖ్యలు చేశారు.
పార్టీ నేతలకు కీలక ఆదేశాలు
బీహార్ ప్రజలు తమకు పూర్తిగా అండగా నిలిచారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వెల్లడించారు. బీహార్ ఎన్నికల్లో గెలుపే స్ఫూర్తిగా జాతీయ రాజకీయా ల్లో సత్తా చాటుదామని పార్టీ నాయకులకు పిలుపునిచ్చా రు. ఎంఐఎం పార్టీ దళిత, మైనార్టీ, బీసీ వర్గాల గొంతుకగా మారి జాతీయ రాజకీయా ల్లో ఉనికిని చాటుకున్నదని పేర్కొన్నారు. మతవాద పార్టీలకు గుణపాఠం చెబుతూనే బహుజన సంక్షేమం కోసం పోరాడుతున్న భావసారూప్యత కలిగిన పార్టీలతో కలిసి పని చేస్తామని ప్రకటించారు.
కొత్త వ్యూహం …
తాజా పరిణామాలు, బీహార్ శాసనసభ ఎన్నికల్లో సత్తా చాటిన ఎంఐఎం పార్టీ జాతీయ రాజకీయాల్లో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తోంది.. హైదరాబాద్ కేంద్రంగా రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆ పార్టీ త్వరలో జరుగనున్న బెంగాల్ ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమని ప్రకటించింది. ఆ తరువాత 2022లో జరుగనున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో కూడా పోటీ చేయనున్నామని వెల్లడించింది. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా పోటీ చేసేందుకు ప్రయత్నిస్తామని ఆ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. తమ పార్టీ ఎవరికీ తోకలా వ్యవహరించదని, అట్టడుగు, బడుగు వర్గాలు, మైనార్టీల పక్షాన పోరాడుతుందన్నారు.