Padma Awards 2023: గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం వివిధ రంగాల్లో సుప్రసిద్ధ సేవలు అందిస్తున్న 106 మందికి పద్మ పురస్కారాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. పద్మ అవార్డుల్లో తెలుగు రాష్ట్రాలకు పెద్ద పీట దక్కడం గర్వకారణం. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి మొత్తంగా 12 అవార్డులు వరించడం, అందులోనూ తొమ్మిది పద్మ భూషణ్ అవార్డులలో రెండు తెలంగాణకు వరించడం విశేషం. అధ్యాత్మిక రంగం నుండి చిన జీయర్ స్వామి, కమలేష్ డి పటేష్ లకు ఈ అవార్డులు దక్కాయి.
చిన జియర్ స్వామి 1956 నవంబర్ 3న దీపావళి పండుగ పర్వదినం రోజున రాజమండ్రి సమీపంలో గల అర్తమూరులో అలవేలు మంగతాయారు, వేంకటాచార్యుల దంపతులకు ప్రధమ సంతానంగా జన్మించారు. ఆయన అసలు పేరు శ్రీమన్నారాయణాచార్యులు. గౌతమ విద్యాపీఠంలో వేదం, వైష్ణవ సంప్రదాయాలలో శిక్షణ పొందారు. తర్క శాస్త్రం, సంస్కృత భాషను నల్లాన్ చక్రవర్తుల రఘునాధాచార్య స్వామి వద్ద అభ్యసించిన శ్రీమన్నారాయణాచార్యులు .. రాజమండ్రిలోని ఓరియంట్ పాఠశాలలో పదవ తరగతి వరకూ చదివారు. అదే సమయంలో వారి తండ్రి స్వర్గస్తులు కావడంతో కుటుంబ పోషణ భారం ఆయన మోయాల్సి వచ్చింది. ఉద్యోగ అన్వేషనలో చేతి సంచితో ఒంటరిగా హైదరాబాద్ చేరుకున్న ఓ చిన్న ఉద్యోగంలో చేరారు. అదే సమయంలో టైపు, షార్ట్ హ్యాండ్ నేర్చుకున్న తర్వాత మంచి కంపెనీలో ఉద్యోగంలోకి మారారు.
అయితే 1975 లో పెద జీయర్ స్వామి కాకినాడ లో యజ్ఞ క్రతువులు నిర్వహించడానికి వచ్చిన సమయంలో చిన జీయర్ స్వామికి పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో తనకు ఒక స్టెనో గ్రాఫర్ కావాలని పెద జీయర్ చెప్పడంతో తాను టైపు షార్ట్ హ్యాండ్ నేర్చుకున్నాననీ, తానే ఆ పని చేస్తానని ముందుకు వచ్చారు చిన జీయర్. ఆ తర్వాత తల్లి అనుమతితో పెద జీయర్ వెంట చిన జీయర్ నడక ప్రారంభించారు. అప్పటి నుండి పెద జీయర్ అడుగు జాడల్లో నడుస్తూ 23 ఏళ్ల వయసులోనే తల్లి అనుమతితో శ్రీమన్నారాయణాచార్యులు1980లో సన్యాసాశ్రమంలోకి అడుగు పెట్టారు. అనంతరం త్రిదండి చిన శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి అయ్యారు. చిన జీయర్ స్వామి 1981 లో నడిగడ్డపాలెంలోని శ్రీమద్ ఉభయ వేదాంత ఆచార్య పీఠానికి అధిపతి అయ్యారు.
సన్యాస స్వీకరణ తర్వాత కొన్నాళ్లకు గీతాజ్యోతి ఉద్యమాన్ని చేపట్టారు. గీతా జ్యోతి ఉద్యమం కేవలం భగవద్గీత ప్రాచుర్య రూపకాన్నే కాక, సమాజంలో ఉన్న సోమరితనాన్ని తొలగించే, సౌభ్రాతత్వ భావనను ప్రతి ఒక్కరిలో జాగృతం చేసే వ్యూహంగా రూపుదిద్దుకుంది. విశ్వకోటికి విజ్ఞానాన్ని అందించేది, మోక్ష సాధనకు పునాది అయిన విద్య వేదం, అలాంటి వేద విద్యని సమస్త సమాజానికి విస్తరింపజేయడానికి జీయర్ ఎడ్యుకే,నల్ ట్రస్ట్, వికాస తరంగిణిల ద్వారా ఎన్నో ఆశ్రమాలను స్థాపించారు. విద్య ఒక వర్గానికో, వర్ణానికో కాక మానవాళికంతటికీ అందాలనే ఉద్దేశంతో ఆ వేద పాఠశాలలనే గురుకుల పాఠశాలలుగా మార్పు చేసి అన్ని రకాల విద్యలనూ బోధించే సౌకర్యం కల్పించారు. 12 నెలల కాలంలో 12 భాషలను నేర్చుకున్న ఘనత చిన జీయర్ ది. ధార్మిక సైనికులను తయారు చేయడంలో కీలక పాత్ర పోషించారు. శ్రీరామనగరం, శంషాబాద్ లో జిమ్స్ అనే ఆసుపత్రిలో ఉచిత వైద్య విధానాన్ని ప్రవేశపెట్టి సేవలో మరో మెట్టు అధిరోహించారు. అనేక సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు, అథ్యాత్మిక ఉపన్యాసాలు నిర్వహించిన తర్వాత రామానుజాచార్యుల వారి సహస్రాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. శంషాబాద్ శ్రీరామనగర్ లో సమతామూర్తి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం అందించింది.
ధ్యాన గురువు – పకృతి ప్రేమికుడు కమలేష్ డి పటేల్
ప్రపంచ వ్యాప్తంగా హార్డ్ పుల్ నెస్ మెడిటేషన్ గైడ్ గా, హార్డ్ ఫుల్ నెస్ ఇన్ స్టిట్యూట్, హార్డ్ ఫుల్ నెస్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ వ్యవస్థాపకుడిగా, సహజ్ మార్గ్ స్పిరిచ్యువాలిటీ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీగా ఉన్న ప్రఖ్యాత ధ్యాన గురువు శ్రీరామ్ చంద్ర మిషన్ అధ్యక్షుడు కమలేష్ డి పటేల్ కు కేంద్రం పద్మభూషణ్ అవార్డు ప్రధానం చేసింది. దాజీ (పెద్దన్న) అని పిలుచుకునే కమలేష్ డి పటేల్ 1956లో గుజరాత్ రాష్ట్రంలో జన్మించారు. ఫార్మసీ విద్యార్ధిగా ఉన్న సమయంలోనే రాజయోగ ధ్యానం మొదలు పెట్టారు. గురువు రామ్ చంద్ర (బాపూజీ) వద్ద 1976 నుండి సాధన ఆరంభించారు. అహ్మదాబాద్ లో ఫార్మసీ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత న్యూయార్క్ వెళ్లి పీజీ పూర్తి చేశారు. అక్కడే ఫార్మా వ్యాపారం ప్రారంభించారు. భార్య, ఇద్దరు పిల్లలతో కొంత కాలం అక్కడే ఉన్నారు. 1983 లో రామ్ చంద్ర మరణంతో అధ్యక్షుడిగా పార్ధసారధి రాజగోపాలాచారి (దారిజీ) బాధ్యతలు చేపట్టారు. ఆయనతో కలిసి 2003 నుండి శ్రీరామచంద్ర మిషన్ కార్యకలాపాల్లో భాగస్వామి అయ్యారు. 2014 నుండి శ్రీరామచంద్ర మిషన్ అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. భారత్ పాటు అమెరికాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఆయన అధ్యాత్మిక కార్యశాలలు నిర్వహించారు. ఆయన రాసిన ది హార్డ్ ఫుల్ నెస్ వే పుస్తకానికి విశేష ఆదరణ లభించింది. పదేళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరులో 1400 ఎకరాల్లో కన్హా శాంతివనం పేరుతో ప్రపంచంలోనే అతి పెద్ద మెడిటేషన్ సెంటర్ ను నెలకొల్పారు. ఒకే సారి లక్ష మంది కూర్చుని ఏకాంతంగా ధ్యానం చేసే అవకాశం కల్పించారు. ఇక్కడ 160 దేశాలకు చెందిన సుమారు 5వేల మంది అభ్యాసికులు ఉన్నారు. ఒకప్పుడు ఎడారిలా ఉన్న ప్రాంతంలో లక్షలాది మొక్కలు నాటి పచ్చదనం పరిఢవిల్లేలా చేశారు. మానసిక రుగ్మతలతో బాధపడుతున్న అనేక మందికి ధ్యానంతో నయం చేస్తున్నారు. 2025లో నాటికి ఇక్కడ 30 బిలియన్ మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ దిశగా ఇక్కడ ప్రతి ఏటా వేలాది మొక్కలు నాటుతూ పర్యావరణాన్ని కాపాడుతున్నారు. ధ్యాన గురువుగా ఆయన చేస్తున్న సేవలకు ఇప్పటికే అనేక అవార్డులు అందుకున్నారు. కమలేశ్ కు ఇద్దరు కుమారులు, ముగ్గురు మనవలు ఉన్నారు.
తెలంగాణ నుండి పద్మశ్రీ లు
డాక్టర్ పసుపులేటి హనుమంతరావు పిల్లల వైద్య నిపుణులు. 1945 సెప్టెంబర్ 16న హైదరాబాద్ పాత నగరంలో జన్మించారు. కాకతీయ విశ్వ విద్యాలయంలో 1970లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. 1975 లో ఎండీ, 2002లో పిహెచ్ డీ పూర్తి చేశారు. పిల్లల వైద్యునిగా పని చేసిన ఆయన క్రమేపీ మానసిక వైకల్యం గల పిల్లలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. వీరి కోసం సేవలందించేందుకు ఆయన వ్యవస్థాపక చైర్మన్ గా స్వీకార్ మల్టిస్పెషాలిటీ రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. లక్షల మంది దివ్యాంగ పిల్లలకు వైద్యునిగా విశేష సేవలు అందించారు. 6,500 మంది వైద్యులకు దివ్యాంగుల పునరావాస చికిత్స కు అవసరమైన శిక్షణ ఇచ్చారు. గాంధీ, నిలోఫర్ తదితర ఆసుపత్రుల్లో దివ్యాంగుల కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. కడప, గుంటూరు, తాండూరు లో స్వీకాన్ ఆధ్వర్యంలో ప్రత్యేక విద్యా కేంద్రాలను నెలకొల్పారు. మొత్తం 35కిపైగా జాతీయ, రాష్ట్ర అంతర్జాతీయ పురస్కారాలను పొందారు. దాదాపు 45 సంవత్సరాల పాటు ఆయన అందించిన సేవలను భారత ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది.
మొదడుగు విజయ గుప్తా సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైయ్యారు. గుప్తా బాపట్లలో 1939 ఆగస్టు 17న జన్మించారు. ఆంధ్ర విశ్వ విద్యాలయం నుండి బీఎస్సీ, బనారస్ హిందూ విశ్వ విద్యాలయం నుండి ఎమ్మెస్సీ, కోల్ కతా విశ్వ విద్యాలయం నుండి డాక్టరేట్ పొందారు. పంత్ యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చర్ టెక్నాలజీ సెంటర్ , ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ ఎడ్యుకేషనల్ లో డాక్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని పొందారు. పదవీ విరమణ తర్వాత గ్లోబల్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (వరల్డ్ ఫిష్) లో సహాయ డైరెక్టర్ జనరల్ గా పని చేశారు. కేంద్రం, ఉమ్మడి ఏపితో పాటు తెలంగాణ ప్రభుత్వంలో మత్స్య శాఖ సాంకేతిక సలహాదారుగా పని చేశారు. దేశంలో నీలి విప్లవం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. చేపల ఉత్పత్తి పెరగడంలో విశేష కృషి చేసి మత్స్యశాఖ శాస్త్రవేత్త మొదడుగు విజయ్ గుప్తా.
ప్రొఫెసర్ బీ రామకృష్ణారెడ్డి గిరిజన బాషలను పరిరక్షించినందుకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించింది. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలానికి చెందిన ఆయన వయసు 80 సంవత్సరాలు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం, కుప్పంలోని ద్రవిడ విశ్వ విద్యాలయానికి రిజిస్టార్ గా బాధ్యతలు నిర్వహించారు. గిరిజన భాషలైన కువి, మండల పై విస్తృత పరిశోధనలు చేశారు. గిరిజన బాషలను కూడా అధికార భాషలుగా గుర్తించాలని కోరుతున్న ఆయన దేశంలో 200 భాషలు ఉంటే అందులో 50 వరకు గిరిజన భాషలు ఉన్నాయని పేర్కొంటున్నారు. మైసూరు సీఐఐఎల్ లో పని చేసిన నాటి నుండి గిరిజన భాషలపై ఆయన పరిశోధనలు ఆరంభించారు.