TDP – Janasena: టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో వీరి సమావేశం జరిగింది. రెండో విడత అభ్యర్ధుల ఎంపిక, బీజేపీతో పొత్తు తదితర అంశాలపై వీరిద్దరూ చర్చించినట్లు సమాచారం. టీడీపీ – జనసేన కూటమిలో బీజేపీ చేరే అంశంపై గత కొంత కాలంగా చర్చలు జరుగుతున్నాయి. రేపో మాపో చంద్రబాబు, పవన్ ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది.
గత కొద్ది రోజుల నుండి పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర బీజేపీ పెద్దలను కలవనున్నారని వార్తలు వెలువడినప్పటికీ ఢిల్లీ పెద్దల అపాయింట్మెంట్ లు ఖరారు కాలేదని సమాచారం. బీజేపీ పెద్దలు ఇతర రాష్ట్రాల పార్లమెంట్ అభ్యర్ధుల ఎంపికతో పాటు వివిధ రాష్ట్రాల పర్యటనల బిజీలో ఉండటంతో ఏపీ వ్యవహారాలపై ఇంకా దృష్టి పెట్టలేదని తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ఇవేళ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ కావడం, మరో పక్క బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఢిల్లీకి పయనమై వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
రాష్ట్రంలో ఎన్నికల సన్నద్దత, అభ్యర్ధుల ఖరారుపై దగ్గుబాటి పురందేశ్వరి ఢిల్లీ పెద్దలతో చర్చలు జరపనున్నారు. ఇటీవలే జిల్లాల్లోని ముఖ్యనేతల నుండి రాష్ట్ర నేతలు అభిప్రాయాలను సేకరించారు. దీనిపై రూపొందించిన నివేదికను అగ్రనేతలకు బీజేపీ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) శివప్రసాద్ సమర్పించనున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఢిల్లీ పెద్దలను కలిసిన తర్వాత టీడీపీ – జనసేన కూటమిలో బీజేపీ భాగస్వామ్యం అవుతుందా లేదా అనే దానిపై హైకమాండ్ నుండి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
ఢిల్లీ పెద్దల నుండి వచ్చే సమాచారం అధారంగా రేపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బయలుదేరి వెళ్లే అవకాశం ఉంది. అయితే ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత రెండో జాబితా విడుదల చేయాలా..ఒక వేళ ఢిల్లీ పర్యటన వాయిదా పడితే రెండో జాబితా ను వెంటనే విడుదల చేద్దామన్న దానిపైనా జరుగుతున్నట్లు తెలుస్తొంది. ఇప్పటికే 94 మందితో టీడీపీ.. అయిదుగురుతో జనసేన తొలి జాబితా ను ప్రకటించిన సంగతి తెలిసిందే.
కాగా, అభ్యర్ధుల రెండో జాబితాపై నిన్న రాత్రి ఒంటి గంట వరకూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో చంద్రబాబు కసరత్తు చేశారు. రెండో జాబితాలో తెలుగుదేశం 25 నుండి 30 సీట్లు.. జనసేన పది సీట్ల వరకూ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. టీడీపీ – జనసేన కూటమిలో బీజేపీ చేరే అంశంపై రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. బీజేపీతో పొత్తుపై రెండు పార్టీల్లోని నేతల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. బీజేపీ హైకమాండ్ తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.
Breaking: దేశ వ్యాప్తంగా నిలిచిపోయిన ఫేస్ బుక్ సేవలు