కన్ను తెరిస్తే జననం. కన్ను మూస్తే మరణం. ఈ రెండు సంఘటనల మధ్య జరిగేదే జీవితం. అటువంటి జీవితం కోసం మనం ఎన్నో కలలు కంటూ ఉంటాం. కొంత మందైతే పక్క వాళ్లకు కూడా ఎటువంటి సాయం చేయకుండా జీవిస్తుంటారు. కానీ కర్ణాటకలో మాత్రం ఓ వ్యక్తి చనిపోతే అతడి అంతిమ యాత్ర కోసం ఇసుకేస్తే రాలనంత మంది జనం వచ్చారు. ఇంతకీ అతడెవరంటే..
ఓ యాచకుడి అంతిమ యాత్రకు అంత మందా?
కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారిలోని హడగలికి చెందిన హుచ్చా బస్యా అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. బస్యా అక్కడ స్థానికంగా ఉంటూ భిక్షాటన చేసుకుంటూ ఉండే వాడు. అతడికి శనివారం రోజు అకస్మాత్తుగా యాక్సిడెంట్ అయింది. దీంతో అక్కడి వారు బస్యాను ఆస్పత్రిలో చేర్పించారు. అయినా కానీ బస్యా బతకలేదు. దీంతో ఆదివారం నాడు బస్యా అంత్యక్రియలను ఆదివారం రోజు బళ్లారిలో నిర్వహించారు. ఈ అంత్య క్రియలకు ఇసుకేస్తే రాలనంతగా జనం తరలివచ్చారు. వారంతా అక్కడికి రావడానికి కారణం బస్యా మంచితనమే. హుచ్చా బస్యా భిక్షాటన చేసినా కూడా తాను నీతిగా , నిజాయతీగా బతికాడు. తనకు ఎవరు ఎంత డబ్బులిచ్చినా కానీ తీసుకునేవాడు కాదట. అతడు కేవలం వారి దగ్గరి నుంచి ఒక్క రూపాయి మాత్రమే తీసుకునేవాడు. తీసుకోమని ఎంత ఫోర్స్ చేసినా కూడా అతడు నిర్మొహమాటంగా రిజెక్ట్ చేసేవాడు. దీంతో అతడని అభిమానించే వారి సంఖ్య ఎక్కువ అయిందట.
బస్యా మాట్లాడాడా?
బస్యా తమతో మాట్లాడితే తమకు మంచి జరుగుతుందని అక్కడి ప్రజలు భావించేవారట. ఆయనతో మాట్లాడడం తమ అదృష్టంగా భావిస్తారట. బస్యా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ మరియు మాజీ మంత్రి పరమేశ్వర నాయక్ వంటి నాయకులతో ఎటువంటి బెరుకూ లేకుండా మాట్లాడేవాడట. అందుకే బస్యాను ఆరాధించే ప్రజలు విపరీతంగా పెరిగిపోయారని అక్కడి ప్రజలు చెబుతున్నారు.