వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా రైతు సంఘాలు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. నిన్న నిర్వహించిన భారత్ బంద్ విజయవంతం అయ్యింది. ఢిల్లీ సరిహద్దులో పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన వేలాది మంది రైతులు పది రోజులకు పైగా ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. కేంద్రంతో పలు దఫాలు చర్చలు జరిపినా ఫలప్రదం కాలేదు. రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఈ తరుణంలో జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నిర్ణయించుకున్నారు. రైతుల ఆందోళనకు తోడు కరోనా నేపథ్యంలో సోనియా గాంధీ ఈ నిర్ణయం తీసుకున్నారు. అభిమానులు, కాంగ్రెస్ నేతలు ఎవ్వరూ తన జన్మదిన వేడుకలు నిర్వహించవద్దని కూడా సోనియా గాంధీ సూచించారు. ఈ మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ అధ్యక్షులకు లేఖలు రాశారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలకు కాంగ్రెస్ నేతలు మద్దతు, సంఘీభావం తెలియజేయాలని సూచించారు.
అయితే జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న సోనియా గాంధీకి ప్రధాన మంత్రి మోడీ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మే గాడ్ బ్లెస్ హర్ విత్ ఎ లాంగ్ అండ్ హెల్తీ లైఫ్ అంటూ ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సహా పలువురు నేతలు కూడా సోనియా గాంధీకి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు.
సోనియా గాంధీ 1946 డిసెంబర్ 9వ తేదీన ఇటలీలో జన్మించారు. సోనియా గాంధీ అసలు పేరు పేరు అడ్విగె ఆంతోనియా మాయినో. రాజీవ్ గాంధీని వివాహం చేసుకున్న తరువాత ఆమె పేరు సోనియా గాంధీగా మార్చుకున్నారు.