ఆంధ్రప్రదేశ్లో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తొలగింపు.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టు తీర్పు.. హైకోర్టు తీర్పు తనకు అనుకూలంగా వచ్చిందనే ఉద్దేశంతో ఆగమేఘాలపై నిమ్మగడ్డ చేపట్టిన బాధ్యతలు, తీసుకున్న చర్యలు.. దీనిపై అడ్వకేట్ జనరల్ శ్రీరాం అభ్యంతరాలు.. ఇవన్నీ తెలిసిన సంగతులే! అయితే ఈ నేపథ్యంలో ఏది కరెక్ట్, ఏది తప్పు అనే విషయంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ బాధ్యతలు తీసుకోవడం సరైందా? కాదా? అనే అంశంపై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు తన యూట్యూబ్ ఛానల్ లో విశ్లేషణ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రత్యేక గౌరవ మర్యాదలు సంపాదించుకున్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఈ వ్యవహారంపై ఎలా స్పందించారు అనేది ఇప్పుడు చూద్దాం!
319 పేరాలున్న హైకోర్టు తీర్పులో పేరా 317, 318 కచ్చితంగా చదవాలని… వీటిలో 317వ పేరాలో… “ఆర్డినెన్స్ ఆధారంగా జారీ చేసిన జీవోలు పక్కకు పెట్టారు. హైకోర్టు తీర్పు ప్రకారం నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తిరిగి తన పదవిని పొందుతాడు. జస్టిస్ కనగరాజ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కాడు”.. అని ఉందని తెలిపిన నాగేశ్వర్… రమేశ్ కుమార్ కు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ బాధ్యతలు అప్పచెప్పాలని హైకోర్టు ఆదేశించిందే తప్ప… తనకు తానుగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు చేపట్టాలని ఆదేశించలేదు అని తెలిపారు. బాధ్యతలు చేపట్టడానికి, నియామకం చేయడానికి చాలా తేడా ఉందని స్పష్టం చేసిన నాగేశ్వర్… నిమ్మగడ్డకు చార్జ్ ఇచ్చి వెళ్లిపొమ్మని జస్టిస్ కనగరాజ్ కు హైకోర్టు చెప్పలేదని.. ఆ ప్రాసెస్ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మాత్రమే హైకోర్టు ఆదేశించిందని.. ఈ విషయాలు 318 పేరా చెబుతుందని నాగేశ్వర్ స్పష్టం చేశారు!
ఇక ఈ విషయంలో ఎగువ న్యాయస్థానానికి అప్పీల్ చేసుకునే హక్కును ఉపయోగించుకోదలిచామని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం అప్పటికే చెప్పింది. అంటే… ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు స్పష్టం చేసిందన్నమాట. ఈ విషయం తెలిసి కూడా, రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకోక ముందే నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తనకు తాను బాధ్యతలు చేపట్టినట్టు ప్రకటించుకుంటే అది పూర్తిగా తప్పే అని.. ఆ తొందరపాటు నిర్ణయం హైకోర్టు తీర్పుకు మాత్రమే వ్యతిరేకం కాకుండా… సహజ న్యాయసూత్రాల పరంగా కూడా తప్పే అవుతుందని నాగేశ్వర్ క్లారిటీ ఇచ్చారు. కావున నిమ్మగడ్డ తొందరపడి బాధ్యతలు చేపట్టడం “డీసెంట్ బిహేవియర్”కు కూడా విరుద్దం అని ప్రొఫెసర్ నాగేశ్వర్ స్పష్టం చేశారు!