గోదావరి నదిలో దొరికే అత్యంత అరుదైన చేప పులస. ఏటికి ఎదురీదుతూ వచ్చే ఈ పులస చేప ఏ చేపకు దక్కని రుచిని, ప్రత్యేకతను సంతరించుకుంటుంది. అరుదుగా లభించి పులస చేప ధర బంగారంతో పోటీ పడుతుంటుంది. అందుకే పులస దొరికితే చాలు మత్స్యకారుల పంట పండినట్లే. అలానే జనం కూడా పులస కోసం పోటీ పడుతుందన్నారు. పుస్తెలమ్మి అయినా పులస తినాలి అన్న నానుడి ఉంది. కోనసీమలో కుండలో పెట్టిన పులస పులుసు ఉందంటే ఆఘమేఖాల మీద హైదరాబాద్ నుండి పెద్ద పెద్ద వాళ్లంతా వాలిపోయేవారంటే అతిశయెక్తి కాదు. వాస్తవానికి పులస కొనాలంటే అయిదొందలో, వెయ్యో ఉంటే సరిపోదు. గత మూడేళ్ల నుండి చూస్తే కిలో పులస పదిహేను వేలకు తక్కువకు దొరకడం లేదు. అదీ కూడా పులసను వేలం ద్వారా దక్కించుకోవాల్సి ఉంటుంది. దీంతో సామాన్యులు, మద్యతరగతి వర్గాల వారు పేరు తలుుచుకోవడమే మానేశారు. పులస కావాలంటే కేజీ పది వేలకుపైగా ఖర్చు పెట్టాల్సిందే.
ఆరోహ వలస జాతికి చెందిన పులసలు సాధారణంగా సముద్రంలో జీవిస్తాయి. సంతానోత్పత్తి కోసం ఆస్ట్రేలియా, టాంజానియా వంటి దేశాల నుండి వచ్చి హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించి అక్కడ నుండి బంగాళాఖాతం మీదుగా వరదల సమయంలో గోదావరిలోకి వచ్చి చేరతాయి. గోదావరికి వరద నీరొచ్చి సముద్రంలో కలిసే సమయంలో గుడ్లు పెట్టేందుకు ఈ చేపలు గోదావరిలోకి ప్రవేశిస్తాయి. గుడ్ల పెట్టిన తర్వాత అక్టోబర్ నాటికి మళ్లీ సాగరానికి చేరుకుంటాయి. అలా వచ్చి వెళుతున్న క్రమంలో జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వరదలు వచ్చినప్పుడు కొన్ని చేపలు జాలర్లకు చిక్కుతాయి. పులస చేప చిక్కితే ఆ జాలర్ల పంట పండినట్లే.
ప్రస్తుతం గోదావరిలో పులస చేపల ప్రవాహం కొనసాగుతోంది. యానాం మార్కెట్ లో గత వారం రెండు కిలోల బరువు ఉన్న పులసను ఓ మహిళ రూ.19వేలకు దక్కించుకుని అనంతరం భైరవపాలెంకు చెందిన మరో వ్యక్తికి దాన్ని రూ.20వేలకు అమ్మేసింది. తాజాగా అంతే బరువు ఉన్న చేపకు అంతకు మించి ధర పలికింది. ఓ మత్స్యకారురుడి వలకు చిక్కిన రెండు కేజీల బరువు ఉన్న పులసను నిన్న సాయంత్రం రాజీవ్ బీచ్ లోని వేలం కేంద్రం వద్ద వేలం వేశారు. పి రత్నం అనే మహిళ దాన్ని రూ.22వేలకు వేలంలో కొనుగోలు చేసింది. అనంతరం దాన్ని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ పోలవరం మండలం టి కొత్తపల్లికి చెందిన వెంకటేశ్వర్లు రూ,.23వేలకు కొనుగోలు చేశారు.