ఢిల్లీ, మార్చి 2 : పాకిస్తాన్ పన్నాగంలో చిక్కాలని ఎవరూ అనుకోవటం లేదని బిజెపి సీనియర్ నేత రామ్ మాధవ్ అన్నారు. శనివారం ఢిల్లీలో ఇండియా టుడే నిర్వహిస్తున్న ‘కాంక్లేవ్ 2019’ కార్యక్రమంలో రామ్ మాధవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు నోబెల్ శాంతి బహుమతి ప్రకటించాలని వస్తున్న డిమాండ్పై రామ్ మాధవ్ స్పందించారు.
ప్రస్తుతం పాకిస్తాన్లో కొంత మంది ప్రజలు, ఇమ్రాన్ ఖాన్ పార్టీ వాళ్లు తమ ప్రధానికి నోబెల్ శాంతి బహుమతి రావాలని కోరుకుంటున్నారు. సరే ఆయనను బహుమతి తీసుకోమనండి. కానీ ఇది నిజంగా పాకిస్తాన్ ప్రజలకు పనికి వచ్చే అంశమేనా అని రామ్ మాధవ్ ప్రశ్నించారు.
ఉగ్రవాదాన్ని రూపుమాపాలని ఇమ్రాన్ నిజంగా భావిస్తే పాక్, భారత్లతో పాటు ప్రపంచం మొత్తానికీ కూడా మంచిదే. కానీ వాళ్లు మారతారని అనుకోవడం లేదు. వారి విధానంలో భాగంగానే ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయని రామ్ మాధవ్ అన్నారు.
భారత పైలట్ అభినందన్ను క్షేమంగా అప్పగించిన కారణంగా తమ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు నోబెల్ శాంతి ప్రకటించాలని పాకిస్తానీయులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ట్విటర్లో #NobelPeacePrizeForImranKhan అనే హ్యాష్ ట్యాగ్తో హల్చల్ చేస్తున్నారు.