చైనాలో పురుడు పోసుకొని ప్రపంచంలోని అన్ని దేశాలను గడగడ లాడించిన కరోనా ప్రభావం భారత దేశంలోనూ తీవ్రంగా చూపింది. కరోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా రెండు నెలలకు పైగా లాక్ డౌన్ అమలు చేయడంతో ఆర్ధిక వ్యవస్థ కుదేలైంది.
లాక్ డౌన్ వల్ల అన్ని రకాల వ్యాపారస్తుల తో పాటు.. వివిధ వర్గాలకు చెందిన ఉద్యోగులు, కార్మికులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ నేపథ్యంలో బ్యాంకుల్లో తీసుకున్న అన్ని రకాల రుణాలను తిరిగి చెల్లించే విషయంలో ఆర్ బీఐ తొలుత మూడు నెలల మారిటోరియం తరువాత మరో మూడు నెలల మారిటోరియంను ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల్లో తీసుకున్న రుణాలకు సంబంధించిన నెలవారీ (emi)వాయిదా మొత్తాన్ని తిరిగి చెల్లించే అవకాశం లేని చాలా మంది ఖాతాదారులు ఆర్ బీఐ ప్రకటించిన మారిటోరియంను వినియోగించుకుంటున్నారు. మారటోరియం ఉపయోగించుకుంటే దాని భారం భారీగా ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు.
సాంకేతికంగా రుణ భారం ఏ స్థాయిలో ఉంటుందన్న విషయాన్ని పరిశీలిస్తే.. కళ్లు బైర్లు కమ్ముతాయి. ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం 15 ఏళ్ళు వ్యవధికి రూ.30 లక్షలు గృహ రుణం 8.4 శాతం వడ్డీకి తీసుకుంటే.. ప్రతి నెల చెల్లించాల్సిన నెలవారీ కిస్తీ రూ.29,367 ఉంటుంది. ఒక వేళ మారిటోరియంను తీసుకుంటే.. ఈ వ్యవధిలో చెల్లించాల్సిన నెల వారి కుస్తీ మీద వడ్డీ రూ.12,6000 వస్తుంది. అప్పుడు మొత్తం అప్పు రూ.31.26 లక్షలు అవుతుందట.
ఇటీవల వడ్డీ రేట్లను తగ్గిస్తూ ఆర్ బీఐ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో ఎనిమిది 8 శాతానికి తగ్గించినా నెలకు రూ.29,367 చొప్పున చెల్లించాల్సిన మొత్తం 180 నెలలకు మరో పదహారు నెలలు అదనంగా కలవటం ఖాయమట. ఒక వేళ జాతీయ బ్యాంకుల నుంచి కాక బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల నుంచి రుణాన్ని తీసుకుంటే.. ఈ భారం మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
మారిటోరియం ఉపయోగించు కోవడం వల్ల తాత్కాలికంగా ఉపశమనం కల్గుతున్నప్పటికీ దీర్ఘకాలంలో మాత్రం భారంగా మారటం ఖాయమని చెబుతున్నారు. ఈ కారణం వల్ల దేశంలోనే అతి పెద్ద బ్యాంక్ అయిన ఎస్ బీ ఐలో రుణాలు తీసుకున్న వారిలో మారిటోరియం సదుపాయాన్ని కేవలం 21.8 శాతం మంది మాత్రమే ఉపయోగించుకుంటున్నారని చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం వడ్డీ అధికం కావడమే. మారిటోరియంను ఉపయోగించుకోవడం అంటే భారీ వడ్డీ భారానికి సిద్ధం కావాల్సిందేనన్న మాట.