బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత , గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోమారు తన సంచలన కామెంట్లతో వార్తల్లో నిలిచారు. పోలీసులు డబ్బులకు అలవాటుపడి ఆవుల అక్రమ రవాణాకు సహకరిస్తున్నారని ఎమ్మెల్యే రాజా సింగ్ ఆరోపించారు.
అయితే , బీజేపీ నాయకులు పోలీసుల నైతికత దెబ్బతినేలా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు. ఈ సంచలన కామెంట్ల నేపథ్యంలో అసలు రాజాసింగ్ ఎందుకు ఇంత దూకుడుగా ప్రవర్తిస్తున్నారనే ప్రశ్న తెరమీదకు వస్తోంది.
అసలేం జరిగింది ?
మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ కు ఆవులను తరలిస్తున్న లారీని రాత్రి రాజాసింగ్ పట్టుకున్నారు. ఆవులను అక్రమంగా తరలిస్తున్నారనే విషయం తెలుసుకున్న రాజాసింగ్ మహారాష్ట్ర నుంచి బహదూర్పుర కు తరలిస్తోన్న ఆవుల లారీని వెంబడించి చౌటుప్పల్ చెక్పోస్ట్ దగ్గర పట్టుకున్నారు. ఆ తర్వాత ఆ వాహనాన్ని స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించారు. తెలంగాణ పోలీసులు డబ్బుల కోసం ఆవుల అక్రమ రవాణాకు సహకరిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. అక్రమంగా ఆవులను తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఘటనపై డీజీపీ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకపోతే తామే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాల్సి వస్తుందని ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించారు .
సజ్జనార్ సంచలనం
ఎమ్మెల్యే రాజాసింగ్ పై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆగ్రహం , అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. పోలీసుల మీద అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కేసులు ఎదుర్కోక తప్పదన్నారు. పోలీసుల మీద, డీజీపీ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయిందని సజ్జనార్ ఫైర్ అయ్యారు. కాగా, ఫైర్ బ్రాండ్ నేతగా తన ముద్రను కాపాడుకునేందుకే రాజాసింగ్ ఇలాంటి సంచలన కామెంట్లు చేస్తున్నారా? అంటూ పలువురు చర్చించుకుంటున్నారు.