తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన యాభై వేల ఉద్యోగాల భర్తీ అంశం ఒకింత వేగంగానే ముందుకు సాగుతోంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేసే ప్రక్రియలో ప్రాథమిక అంకం పూర్తయింది.
వివిధ ప్రభుత్వ శాఖలలో ఉన్న ఖాళీలు, కొన్నింటిలో ఇప్పటికే విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలు జిల్లాలవారీగా ప్రభుత్వానికి చేరాయి. ఆయా శాఖల అధికారులు యుద్ధప్రాతిపదికన ఆదివారం కూడా పనిచేసి పూర్తి వివరాలను సోమ, మంగళవారాల్లో ప్రభుత్వానికి అందించారు. వివిధ శాఖల్లో సుమారు 45 వేలు, సంస్థల్లో 20 వేల పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని ఆయా శాఖల ముఖ్యకార్యదర్శులు ప్రభుత్వానికి నివేదించారు.
ఎందులో ఎక్కువ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వానికి అందిన ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో ఉద్యోగ ఖాళీల వివరాల ప్రకారం పోలీసు, విద్య, వైద్య ఆరోగ్య శాఖలలో ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి. పాఠశాల విద్యాశాఖలో 9,600 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆ శాఖ ఉన్నతాధికారులు నివేదికలో పేర్కొన్నారు. ఇందులో ప్రత్యేక గ్రేడ్ ఉపాధ్యాయులు (ఎస్జీటీ) 5,800, స్కూలు అసిస్టెంట్లు 2,500, భాషాపండితులు, వ్యాయామ ఉపాధ్యాయులు 300, మోడల్ పాఠశాలల ఉపాధ్యాయుల పోస్టులు 1000 ఉన్నాయి. ఇవి కాక ఉన్నతవిద్య, విశ్వవిద్యాలయాలు, సాంకేతిక విద్యాశాఖల పోస్టులు మరో 3 వేల వరకు ఉన్నాయి.
ఇప్పుడేం జరుగుతోంది?
ఉద్యోగాల భర్తీలో భాగంగా, జిల్లాల నుంచి వచ్చిన వివరాలను ఆ యా శాఖల అధికారులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్కు అందించారు. ఆ వివరాలను క్రోడీకరించి, ఖాళీల జాబితా, ఆ యా స్థానాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల జాబితాను అతి త్వరలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు నివేదించనున్నారు. ఆ నివేదికను సీఎం పరిశీలించిన తరువాత ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. భారీ స్థాయిలో వైద్య, విద్య, పోలీస్ శాఖల్లో నియామకాలు చేపట్టేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని సర్కారు ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. వీటితో పాటుమిగిలిన శాఖల్లో ఉన్న ఖాళీలను కూడా వాటి అవసరాల మేరకు నియామకాలు చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఉద్యోగాల భర్తీలో భాగంగా వీఆర్వోలను వివిధ శాఖలలో సర్దుబాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీఆర్వోలను సర్దుబాటు చేసిన తరువాత మిగిలిన ఖాళీలపై స్పష్టత వస్తుంది. నూతన పంచాయతీరాజ్ చట్టం ద్వారా ఏర్పడిన అన్ని గ్రామాలకు సర్కారు భారీ ఎత్తున జూనియర్ పంచాయతీ కార్యదర్శులను నియమించింది. వారిని కూడా పర్మినెంట్ చేయాల్సిన అవసరం ఉంది. దీనిపై కూడా అధికారులు దృష్టి సారించనున్నారు. ఇదే సమయంలో శాఖల వారీగా వచ్చిన వివరాలను ఆర్థిక శాఖ క్రోడీకరిస్తోంది.