నెల్లూరు, జనవరి 8: ఇద్దరు అంతర్జాతీయ స్మగ్లర్లతో పాటు ఎనిమిది మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండి కోటి 75లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను, వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు నెల్లూరు జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితులను చూపి వివరాలు వెల్లడించారు.
జిల్లాలో గత కొంత కాలంగా చాటుమాటుగా జరుగుతున్న ఎర్రచందనం అక్రమ రవాణాను నిరోధించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు. నిందితుల్లో ఇద్దరు కర్నాటక రాష్ట్రానికి చెందిన వారని చెప్పారు.
చైనా, సింగపూర్, మలేషియా, జపాన్, హంగ్కాంగ్, అరబ్దేశాలలో ఎర్రచందనంకు ఎక్కువ డిమాండ్ ఉండటం వల్ల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని అయన అన్నారు. గత ఐదేళ్లలో సుమారు 40వేల మెట్రిక్ టన్నుల ఎర్రచందనం ఆంధ్రప్రదేశ్ నుండి వివిధ దేశాలకు తరలివెళ్లినట్లు ఆయన తెలిపారు.