బెంగుళూర్ డిసెంబర్ 26: దేంలోనే అత్యంత పొడవైన బోగీబీల్ రైలు,రోడ్డు వంతెనను ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం అసోంలో ప్రారంభించారు. 21 ఏళ్ల క్రితం ఈ వంతెనకు శంకుస్థాపన చేసింది అప్పటి ప్రధాని దేవెగౌడ. అయితే దేవెగౌడకు ఈ ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందలేదు. ఆ మాట ప్రస్తావనకు వచ్చినపుడు ‘నన్నెవరు గుర్తు పెట్టుకుంటారు అని దేవెగౌడ అన్నారు.
బెంగళూరులో ఓ కార్యక్రమానికి హాజరైన దేవెగౌడను బోగీబీల్ వంతెన గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. వంతెన ప్రారంభోత్సవానికి మీకు ఆహ్వానం వచ్చిందా అని అడగగా నన్నెవరు గుర్తు పెట్టుకుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. నేను ప్రధానిగా ఉన్న సమయంలో కశ్మీర్కు రైల్వే లైను, ఢిల్లీ మెట్రో, బోగీబీల్ వంతెన ప్రాజెక్టులను మంజూరు చేసి శంకుస్థాపన కూడా చేశాను. ప్రజలు ఆ విషయాన్ని మర్చిపోయారు అని వాపోయారు. ఇక బోగీబీల్ వంతెన నిర్మాణం ఆలస్యంపై స్పందించిన దేవెగౌడ హసన్,మైసూరు ప్రాజెక్టును 13 నెలల్లోనే పూర్తిచేశానని చెప్పారు. మరో రెండు వంతెనలను కూడా చెప్పిన సమయంలోనే పూర్తిచేశామన్నారు. దేవెగౌడ ఏం చేయలేదని కొందరు అంటున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. అలా అనే వారంతా నేను పూర్తిచేసిన వంతెనల వద్దకు వెళ్లి చూడాలి అన్నారు.
బోగీబీల్ వంతెనకు దేవెగౌడ 1997లో శంఖుస్తాపన చేసినప్పటికీ, 2002లో నాటి ప్రధాని వాజ్పేయీ హయాంలో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.