Road Accident: వేగంగా వెళుతున్న ఓ కారు అదుపు తప్పి బావిలో పడటంతో నలుగురు మృతి చెందారు. ఈ ఘోర ప్రమాదం మహబూబ్ నగర్ జిల్లా కేసముద్రం శివారులోని బైపాస్ రోడ్ లో జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలానికి చెందిన వారు పర్వతగిరి మండలంలోని అన్నారం గ్రామంలో ఓ ఫంక్షన్ కి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉండగా ఈ దారుణం జరిగింది. ఏడుగురు ప్రయాణీకుల్లో నలుగురు మృతి చెందగా, మరో ముగ్గురు గల్లంతు అయ్యారు. ప్రమాదానికి గురైన వారిలో అయిదుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు కాగా, మిగిలిన ఇద్దరూ వారికి తెలిసిన వారని సమాచారం. చీకటిగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.
ప్రమాదం జరిగిన సమయంలో కారులో భద్రు, బిక్కు, అచ్చాలి, సుమలత, దీక్షిత అనే అయిదుగురు కుటుంబ సభ్యులతో పాటు మరో ఇద్దరు ఉన్నారు. ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు కారుతో సహా బావిలో మునిగిపోయారు. విషయం తెలిసిన వెంటనే కేసముద్రం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బావిలో పడ్డవారిని బయటకు తీసే ప్రయత్నం చేశారు. బాధితులను మహబూబ్ నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.