Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారిని సామాన్యులు మొదలు కొని ప్రముఖుల వరకూ నిత్యం లక్షలాది మంది దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకుంటుంటారు. ప్రతి ఒక్కరూ వారి వారి కుటుంబాల బాధలు తొలగిపోవాలని, అష్ట ఐశ్యర్వాలు కలగాలని వేడుకుంటుంటారు. కోరిన కోర్కెలు నెరవేరిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకుంటుంటారు. కొందరు వారి వ్యాపారాలు, సంస్థలు ఇబ్బందులు లేకుండా కొనసాగాలి. విద్యార్ధులు వారి చదువు సక్రమంగా సాగాలని, నిరుద్యోగులు ఉద్యోగాలు రావాలని ఇలా ఎవరికి వారు తమ కోర్కెలు స్వామివారికి విన్నవించుకుని మొక్కుబడులు చెల్లించుకుంటారు.
Tirumala: ఆర్ధిక ఇబ్బందుల నుండి గట్టింకించాలి స్వామి
కానీ ప్రభుత్వంలోని పెద్దలు మాత్రం ఆర్ధిక పరిస్థితి నుండి రాష్ట్రాన్ని గట్టింకించాలని స్వామి వారిని వేడుకుంటున్నారు. అందుకు ప్రధాన కారణంగా కేంద్రం నుండి రావాల్సిన బకాయి నిధులు విడుదల కావడం లేదు. కోవిడ్ మూలంగా రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం అంతంత మాత్రంగానే ఉంది. గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను కొనసాగిస్తుండటంతో నిధులకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ప్రతి నెలా అప్పులు తెస్తే తప్ప రాష్ట్రంలో పరిపాలన గడవని పరిస్థితి నెలకొంది. ఉద్యోగులకు జీతాలు చెల్లించాలన్నా కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ నిధుల కోసమే, లేదా కొత్త అప్పులు తీసుకురావడమో చేయాల్సి వస్తోంది. రాష్ట్ర పెద్దలు, ఎంపీలు తరచు కేంద్రం వద్ద బకాయిలు మంజూరుకు వేడుకుంటున్నా కేంద్రం కనికరం చూపడం లేదు. అడపాదడపా నిధులను విడుదల చేస్తోంది. కేంద్రం నుండి విడుదల చేయాల్సిన నిధులను అయితే విడుదల చేయడం లేదు కానీ పరిమితికి మించి అప్పులు చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ వస్తోంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే రాష్ట్ర ప్రభుత్వంలోని ఓ పెద్ద నాయకుడు శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకుని వారి సొంత కోరికలను పక్కన పెట్టి రాష్ట్రం గురించి వేడుకున్నారుట. ఇంతకూ తిరుమల శ్రీవారి ఎవరు దర్శించుకున్నారు.. ఏమి వేడుకున్నారు అంటే.
Tirumala: ఆర్ధికపరమైన ఇబ్బందులు ఉన్నా సరైన దిశలో రాష్ట్రం
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిలు నేటి వేకువ జామున వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకస్వామి మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్ధ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్ధిక వ్యవస్థ కుంగిపోయిందన్నారు. ఆర్ధికపరమైన ఇబ్బందులు ఉన్నా జగన్ పాలనలో రాష్ట్రం సరైన దిశలో వెళుతోందన్నారు. కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధులన్నీ సకాలంలో రావాలని శ్రీవారిని ప్రార్ధించినట్లు చెప్పారు సజ్జల.