తెలుగు రాష్ట్రాల మధ్య నీటి యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కృష్ణా- గోదావరి నీటి వాటాల విషయంలో తమదైన శైలిలో పరిపాలిస్తున్న రాష్ట్రం పక్షాన వాదన వినిపిస్తున్నారు.
ఈ మాటల యుద్ధం కాస్త అపెక్స్ కమిటీ సమావేశం వరకూ చేరింది. అయితే, ఆ సమావేశం అనంతరం కూడా ఎత్తులు- పై ఎత్తులు గేమ్ ప్లాన్ ఆగిపోవడం లేదు. తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులను సమీక్షించి రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉందని వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. తద్వారా తెలంగాణ సీఎం కేసీఆర్కు నేరుగా వైసీపీ తరఫున ఏపీ ప్రభుత్వ వైఖరిని తెలియజేశారు.
కేసీఆర్ నిప్పులు…
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న తెలంగాణ సీఎం కేసీఆర్ తన రాష్ట్ర వైఖరిని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వ తీరుపై తెలంగాణ సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. గతంలోలా ఏపీ తన పద్ధతిని మార్చుకోకుంటే కుదరదని స్పష్టం చేశారు. రెండు గంటలపాటు కొనసాగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కృష్ణా, గోదావరి నదీ జలాలపై తెలంగాణకున్న న్యాయమైన హక్కులు, వాటాల గురించి అపెక్స్ కౌన్సిల్ చైర్మన్ కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తోపాటు, దిగువ రాష్ట్రమైన ఏపీ సీఎం జగన్కు తెలంగాణ వైఖరిని స్పష్టం చేశారు. కృష్ణానదిపై ఏపీ అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలను ఆపకుంటే, తాము కూడా అలంపూర్ – పెద్ద మరూర్ వద్ద బ్యారేజీ నిర్మించి తీరుతామని, తద్వారా రోజుకు 3 టీఎంసీల సాగునీటిని ఎత్తిపోయడం ఖాయమని సీఎం కేసీఆర్ తేల్చేశారు.
కేసీఆర్ – జగన్ లాలూచీ
అయితే, తెలంగాణ సీఎం కామెంట్ల అనంతరం రాయలసీమకు చెందిన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. అపెక్స్ కౌన్సిల్లో మినిట్సే ముఖ్యమని.. బయటకు వచ్చాక కేసీఆర్ ఏం మాట్లాడినా రాజకీయంగానే చూడాలని అన్నారు. రాయలసీమ ప్రాజెక్టులను నింపిన పరిస్థితి ఎప్పుడూ లేదన్న ప్రకాష్ గతంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బలహీనమైన సీఎంగా ఉండడం ఏపీకి నష్టమని అన్నారు. తెలంగాణ నీటి నిల్వల పైనా ఏపీ హక్కు కల్పించాల్సి ఉంటుందని ఆయన కొత్త వాదన తెరమీదకు తెచ్చారు. గోదావరి, కృష్ణా డెల్టా, నాగార్జున సాగర్ ఆయకట్టుకు నీటి అవసరాలు తీర్చాకే గోదావరిపై తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులివ్వాలని డిమాండ్ చేశారు. కృష్ణా జలాలపై సుప్రీంలో వేసిన కేసును వెనక్కు తీసుకునేందుకు తెలంగాణ ఒప్పుకుందని తోపుదుర్తి ప్రకాష్ చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ -జగన్ లాలూచీ పడ్డారనే రీతిలో ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. ప్రతిపక్షాల విమర్శల నుంచి తప్పించుకునేందుకు కేసీఆర్ స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నారని అభిప్రాయ పడ్డారు. తెలంగాణలో ప్రతిపక్షాలు బాధ్యతగా వ్యవహరించాలని ప్రకాష్ కోరారు.
ట్విస్ట్ ఇచ్చిన కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి వివాదంలో ఓ ట్విస్ట్ ఇచ్చారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనే ఈ మేరకు ఆయన వివరాలు వెల్లడించారు. అంతర్ రాష్ట్ర జలవివాదాల చట్టం కింద ఫిర్యాదుల స్వీకరణకు ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని 2014లోనే కేంద్రానికి లేఖ రాశామని.. ఇందుకు సంబంధించి కేంద్రం ఇప్పటి వరకు ఎ లాంటి చర్యలు తీసుకోకపోవడంతో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అయితే, తెలంగాణ పిటిషన్ కారణంగా తాము ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నట్లు కేంద్ర మంత్రి షెకావత్ సమావేశంలో ప్రస్తావించారు.. దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్ కేంద్రం ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తే సుప్రీంకోర్టులో కేసును వెనక్కు తీసుకోవడానికి అభ్యంతరం లేదని తెలిపారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని తక్షణమే పరిష్కరించాలని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కాగా, వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ కామెంట్ల నేపథ్యంలో ఇరు రాష్ట్రాల నేతలు ఏ విధంగా స్పందిస్తారో మరి.