బీజేపీ ఫైర్ బ్రాండ్ లీడర్ , ఆ పార్టీ శాసన సభా పక్షనేత రాజా సింగ్ మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ దఫా వేరే పార్టీ వాళ్లను ఇరకాటంలో పడేసేందుకు ఆయన కామెంట్లు చేయలేదు. సొంత పార్టీ నేతలను టార్గెట్ చేశారు. ప్రస్తుత కామెంట్లు చూస్తుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గురించేనని పలువురు అంచనా వేస్తున్నారు. ఏకంగా పార్టీని వ్యతిరేకించే , పార్టీ పెద్దలకే బీపీ పుట్టే వ్యాఖ్యలు చేశారు.
రాజాసింగ్ కలకలం….
గో రక్షణ కార్యాలయంలో రాజాసింగ్ పాల్గొన్నారు. గోమాత నా తల్లి.. గోరక్షణ నాధర్మం.. నా కర్తవ్యం అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్క ఆవును హిందువులు కాపాడుకోవాలన్న ఆయన హిందూ ధర్మం.. గోరక్షణ కోసం ఎంత వరకైనా వెళ్తానని అన్నారు. ఆవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. పదవులు నాకు లెక్క కాదని రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గో రక్షణలో తమకు అడ్డు వస్తే సొంత పార్టీనైనా తొక్కేస్తానని రాజ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గో రక్షణ కోసం గతంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటే పార్టీ ఒప్పుకోలేదని ఉన్న ఒక్క ఎమ్మెల్యే రాజీనామా చేస్తే కష్ణమని పార్టీ పెద్దలు బ్రతిమలాడారని అన్నారు. పార్టీనైనా.. పదవినైనా గోరక్షణ కోసం కాళ్ళకింద తొక్కేస్తానని ఆయన అన్నారు.
బండి సంజయ్ ని టార్గెట్ చేశారా?
గత కొద్దికాలంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు , ఎంపీ బండి సంజయ్ కి ఎమ్మెల్యే రాజాసింగ్ కు మధ్య ప్రచ్చన్న యుద్ధం వంటి పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు. కమిటీల కూర్పు నుంచి మొదలుకొని పార్టీకి సంబంధించిన ముఖ్య నిర్ణయాల వరకూ రాజాసింగ్ కు ప్రాధాన్యం దక్కడం లేదని అంటున్నారు. ఒకటి రెండు సందర్భాల్లో రాజాసింగ్ అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇరువురు నేతల మధ్య ఉన్న గ్యాప్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తుందంటున్నారు.