తెలంగాణలో గత కొద్దిరోజులుగా ఎన్నికల వేడి కొనసాగుతోంది. దుబ్బాక ఉప ఎన్నిక, అనంతరం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందడి జరిగింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో మరో నియోజకవర్గంలో ఉప ఎన్నిక తప్పనిసరి పరిస్థితి నెలకొంది..
నోముల నర్సింహయ్య ప్రాతినిథ్యం వహించిన నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలోనే ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. అయితే, ఈ ఉప ఎన్నిక విషయంలో ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి.
జానారెడ్డి కేరాఫ్ ట్విస్టులు
తెలంగాణలోని సీనియర్ రాజకీయ వేత్తల్లో జానారెడ్డి ఒకరు. కీలకమైన నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం పేరు చెప్పగానే జానారెడ్డి పేరు వెంటనే గుర్తుకు వస్తుంది. సుదీర్ఘకాలం పాటు ఈ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించారు జానారెడ్డి ఎన్నో కీలక పదవులను అధిష్టించారు. అయితే, గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నేత నోముల నర్సింహయ్య చేతిలో ఓటమి పాలయ్యారు. నోముల మృతితో ఉప ఎన్నిక తప్పని పరిస్థితి ఏర్పడడంతో మరో సారి జానారెడ్డి పోటీ చేయడం ఖాయమని అంతా భావిస్తున్న తరుణంలో సంచలన వ్యాఖ్యలు చేశారు
దటీజ్ జానారెడ్డి …
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయడం గురించి జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేసిన ఆయన రెండేళ్ల కోసం తాను పోటీచేసి ఏం లాభం అని ప్రశ్నించారు. ఎన్నికల్లో పోటీచేయనని గతంలోనే చెప్పానని.. రాహుల్ గాంధీ వచ్చి చెప్పినా తన నిర్ణయం మారబోదన్నారు. ఉప ఎన్నికల్లో తన కుమారుడు పోటీ చేస్తారని జానారెడ్డి మరో ట్విస్టు ఇచ్చారు. అంతే కాకుండా , నాగార్జున సాగర్ లో పార్టీ అధిష్టానం ఎవ్వరికి టికెట్ ఇచ్చిన కలిసి పనిచేస్తామని వెల్లడించారు. దీంతో పాటుగా ఇంకో బాంబ్ పేల్చారు.
బీజేపీలోకి జానారెడ్డి ?
బీజేపీలోకి జానా రెడ్డి అంటూ గత కొద్దికాలంగా ప్రచారం జోరుగా జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై జానా రెడ్డి మరింత క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు రానున్నాయని ఆయన అన్నారు. తాను పార్టీ మారడం కేవలం ప్రచారం మాత్రమేనని తేల్చి చెప్పారు. తనను ఎవ్వరూ సంప్రదించలేదని , తాను ఎవరిని సంప్రదించలేదని జానారెడ్డి కొట్టిపారేశారు. పీసీసీ అధ్యక్ష పదవికి ముందు వరుసలో తానే ఉండాలి కానీ అధిష్టానం ఎవ్వరికిచ్చిన సహకరిస్తానని ఆయన అన్నారు.