తెలంగాణలో ప్రస్తుతం ఎన్నికల వాతావరణం నెలకొన్నది. తెలంగాణలో కొన్ని రోజుల వరకు ఎన్నికల వాతావారణం లేకుండా ప్రశాంతంగా ఉంది. మళ్లీ ఇప్పుడు వరుసగా ఎన్నికలు రాబోతున్నాయి. గ్రేటర్ ఎన్నికలతో పాటుగా.. దుబ్బాక ఉపఎన్నిక, ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండటంతో రాష్ట్రంలోని పార్టీలన్నీ వెంటనే తమ ప్రచారాన్ని ప్రారంభించాయి. సరైన అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తు చేస్తున్నాయి.
ఇక.. దుబ్బాక ఉపఎన్నికకు సంబంధించి అధికార టీఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కూడా మాంచి ఊపు మీదున్నాయి. దుబ్బాక ఎన్నికలో ఈసారి ఎలాగైనా గెలిచి తమ సత్తా చాటాలని బీజేపీ, కాంగ్రెస్ తాపత్రయపడుతుండగా.. తమ పార్టీకి ఉన్న పాపులారిటీ ఏమాత్రం తగ్గలేదు అని చెప్పుకోవడం కోసం దుబ్బాక గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది టీఆర్ఎస్ పార్టీ.
దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణించడంతో.. అక్కడ ఉపఎన్నిక అనివార్యం అయిన సంగతి తెలిసిందే. అయితే.. దుబ్బాక ఉపఎన్నిక కోసం టీఆర్ఎస్ పార్టీ సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాతనే బరిలోకి దించుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమె పేరును ఖరారు చేశారు.
సోలిపేట రామలింగారెడ్డి.. తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు. ఆయనకు అందుకే టీఆర్ఎస్ పార్టీలో మంచి స్థానం ఇచ్చాం. తెలంగాణ రాకముందు ఉద్యమం కోసం.. తెలంగాణ వచ్చాక పార్టీ కోసం ఆయన ఎంతో అంకిత భావంతో పనిచేశవారు. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి కోసం తన చివరి శ్వాస వరకు సోలిపేట కష్టపడి పనిచేశారు. రామలింగారెడ్డితో పాటు.. ఆయన కుటుంబం కూడా ఉద్యమంలో పాల్గొన్నది. నియోజకవర్గ అభివృద్ధిలో ఆయన కుటుంబ పాత్ర కూడా మరువలేనిది. అలాగే ఆయన కుటుంబంతో నియోజకవర్గాన్న ఎంతో అనుబంధం ఉంది. అందుకే.. ఆయన తరుపున నియోజకవర్గ అభివృద్ధి బాధ్యతలను ఆయన కుటుంబ సభ్యులైతేనే సరిగ్గా నిర్వర్తించగలరు. అందుకే.. ఆయన సతీమణి సుజాతకు ఉపఎన్నికలో సీటు ఇచ్చాం.. అని సీఎం కేసీఆర్ ఈసందర్భంగా తెలియజేశారు.