కరోనా నేపథ్యంలో ఇప్పటికే అనేక రాష్ట్రాలలో జరగాల్సిన అనేక బోర్డు, ప్రవేశ పరీక్షలను రద్దు చేశారు. బోర్డు పరీక్షలకు గాను విద్యార్థుల అంతర్గత మార్కులను ఆధారంగా చేసుకుని ఫైనల్ రిజల్ట్స్ను కూడా విడుదల చేస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో చదువుతున్న విద్యార్థుల పరీక్షలు మాత్రం ఇంకా రద్దు కాలేదు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఈ విషయమై తర్జన భర్జనలు పడుతోంది. అయితే విద్యార్థులు మాత్రం.. మాకు పరీక్షలు వద్దు బాబోయ్.. కరోనా ఉంది.. పరీక్షలు రాయలేం.. అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నడుపుతున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో #ExamsInCovidASuicide అనే హ్యాష్ట్యాగ్ పేరిట పెద్ద ఉద్యమమే నడుస్తోంది. ట్విట్టర్లో ఇప్పటికే ఈ హ్యాష్ట్యాగ్ పేరిట సుమారుగా 1.20 లక్షలకు పైగా ఇంప్రెషన్లు వచ్చాయి. కరోనా మహమ్మారి భయం వెంటాడుతుంటే పరీక్షలు ఎలా రాస్తాం ? ఏసీ గదుల్లో ఉండి మీరు పరీక్షలు రాయమంటే.. మేం రాయాలా ? మా ప్రాణాలంటే మీకు లెక్కలేదా ? అంటూ విద్యార్థులు యూజీసీని ప్రశ్నిస్తున్నారు. ఇక ఇదే విషయమై మహారాష్ట్రలోని శివసేన పార్టీకి చెందిన యువసేన విభాగం సుప్రీం కోర్టులో పిటిషన్ కూడా వేసింది. ఆ విభాగ కార్యదర్శి వరుణ్ సర్దేశాయ్.. కోవిడ్ వల్ల విద్యార్థులు పరీక్షలు రాయాలంటే భయపడుతున్నారని.. అందువల్ల పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు.
కాగా యూజీసీ చెబుతున్న ప్రకారం.. దేశవ్యాప్తంగా ఉన్న 755 యూనివర్సిటీల్లో మొత్తం 321 స్టేట్ యూనివర్సిటీలు, 274 ప్రైవేటు వర్సిటీలు, 120 డీమ్డ్ వర్సిటీలు, 40 సెంట్రల్ యూనివర్సిటీలు ఉన్నాయని, వాటిలో 194 వర్సిటీల్లో ఇప్పటికే పరీక్షలు నిర్వహించారని, మరో 366 యూనివర్సిటీల్లో ఆగస్టు, సెప్టెంబర్ నెలల మధ్య పరీక్షలను నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారని వెల్లడైంది. అయితే విద్యార్థులు మాత్రం టర్మినల్ సెమిస్టర్ పరీక్షలతోపాటు ఫైనలియర్ పరీక్షలను కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి సుప్రీం కోర్టులో ఏం తీర్పు చెబుతారో చూడాలి.