తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా జరుగుతున్న రాజకీయ ఎత్తుగడలు, విమర్శల పర్వం రంజుగా మారిన సంగతి తెలిసిందే. ఒక పార్టీని మించి మరో పార్టీ వ్యూహాలు పన్నుతోంది.
ప్రధానంగా బీజేపీ టీఆర్ఎస్లు ఈ స్కెచ్లలో బిజీగా ఉన్నాయి. ఈ ఎత్తుగడలోకి తాజాగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఎంట్రీ ఇచ్చారు.
అసలేం జరిగిందంటే….
గ్రేటర్ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపత్యంలో తాజాగా ఢిల్లీ పెద్దలు సైతం ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ నగరానికి వచ్చి టీఆర్ఎస్ పాలనపై ఛార్జ్ షీట్ విడుదల చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. హైదరాబాద్ను డల్లాస్, ఇస్తాంబుల్ చేస్తామని హామీ ఇచ్చి వరదలతో ముంచారని విమర్శలు గుప్పించారు. సిటీలో డ్రైనేజీ వ్యవస్థ అత్యంత దారుణంగా ఉంది. లక్ష మంది యువకులకు ఉద్యోగాలు ఇస్తామన్న హామీకి దిక్కు లేకుండా పోయింది’ అని జవదేకర్ వివరించారు.
కుటుంబ పాలనపై విరక్తి
ఒకే కుటుంబ పాలనపై ప్రజలు కోపంగా ఉన్నారని ప్రకాశ్ జవదేకర్ పేర్కొన్నారు. తెలంగాణలో అవినీతి పెరిగిపోయింది. కేసీఆర్ ఫ్యామిలీతోపాటు ఆయన సన్నిహితుల ఆస్తులు పెరుగుతున్నాయి. అదే సమయంలో రాష్ట్ర అప్పులు పెరుగుతుండటం గమనార్హం. ఒకే కుటుంబం పాలన సాగిస్తుండటంపై రాష్ట్ర ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఎంఐఎం కూడా ఒక కుటుంబ పార్టీనే. ఇక్కడ కేసీఆర్, కేటీఆర్ ఉన్నారు.. ఇక్కడ అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఓవైసీలు ఉన్నారు. ఈ పార్టీలు గత ఆరేళ్లలో ప్రజలను దోచుకున్నాయి.“ అంటూ మండిపడ్డారు.
రేవంత్ ఎంట్రీ
అయితే, కేంద్ర మంత్రి జవదేకర్ ఛార్జ్షీట్ విడుదల ఎపిసోడ్పై మల్కాజిగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఛార్జ్షీట్ పేరుతో బీజేపీ నాటకానికి తెర లేపిందని ఆరోపించారు. తాను కేంద్ర మంత్రి జవదేకర్పై ఛార్జ్షీట్ విడుదల చేస్తున్నట్లు తెలిపారు. శ్రీశైలం, కల్వకుర్తి ప్రాజెక్టుల అక్రమాలపై కేంద్ర పర్యావరణశాఖ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. తెలంగాణను కాలుష్యం చేస్తున్నారని కేంద్రానికి ఎన్నో లేఖలు రాశామన్నారు. ముందస్తుగా ఫిర్యాదు చేస్తే స్పందించలేదని మండిపడ్డారు. టీఆర్ఎస్ సూత్రదారి, బీజేపీ పాత్రదారి అంటూ విమర్శలు గుప్పించారు. ప్రకాశ్ జలదేకర్కు చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్, కేటీఆర్లపై చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.