పీఎఫ్ఐ సంస్థతో సంబంధం ఉన్న సభ్యుల కార్యాలయాలపై మంగళవారం సోదాలు చేపట్టింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, అస్సాం, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల్లో సోదాలు జరుగుతున్నాయి. విదేశాల నుండి నిధులు సేకరిస్తూ దేశంలో మత విద్వేషాలు రెచ్చగొడుతోందన్న అభియోగాలు ఎదుర్కొంటున్న ఈ సంస్థపై గత వారం ఎన్ ఐ ఏ ఆకస్మిక దాడులు చేపట్టిన సంగతి తెలిసిందే. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఇచ్చిన సమాచారంతో కేంద్ర హోం శఖ పర్యవేక్షణలో ఈ దాడులు జరుగుతున్నాయి.
కర్ణాటక లో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన దాడుల్లో పీఎఫ్ఐ రాజకీయ విభాగం సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్డీపిఐ) కి చెందిన 75 మంది కార్యకర్తలు, నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఎన్డీపిఐ యాదగిరి జిల్లా అధ్యక్షుడితో సహా 75 మంది పీఎఫ్ఐ, ఎన్డీపీఐ కార్యక్రతలు, నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నామనీ, 108, 151 సీఆర్పీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని బెంగళూరు శాంతి భద్రతల విభాగం ఏడిజిపీ అలోక్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలోని దేవనహళ్లి, బెంగళూరు రూరల్, చిక్కబళ్లాపూర్, చిత్రదుర్గ, రాయచూర్, హసన్, బళ్లారి, బాగల్ కోట్, కోప్పల్ తదితర జిల్లాల్లో దాడులు నిర్వహించారు. పీఎఫ్ఐ రాయచూర్ జిల్లా మాజీ అధ్యక్షుడు మహ్మద్ ఇస్మాయిల్ ను కూడా అరెస్టు చేసి జ్యూడిషియల్ కస్టడీకి పంపినట్లు ఆయన తెలిపారు. మైసూర్ లో ముగ్గురు పీడీఎఫ్ నేతలను, చామరాజనగర్ లో ఇద్దరు నేతలను అదుపులోకి తీసుకున్నారు. మంగళూరులో జిల్లా అధ్యక్షుడుతో పాటు ఎనిమిది మంది పీఎఫ్ఐ నేతలను అదుపులోకి తీసుకున్నారు. హస్కోట్ కు చెందిన నలుగురు, చిక్ బల్లాపూర్ కు చెందిన ముగ్గురు, బెంగళూరు రూరల్ కు చెందిన తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు.
ఉత్తరప్రదేశ్ లో రాష్ట్ర ఏటీఎస్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేపట్టి డజనుకు పైగా పీడీఎఫ్ నేతలను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. మహారాష్ట్రలోనూ పీడీఎఫ్ కి సంబంధించిన వ్యక్తులపై దాడులు కొనసాగుతున్నాయి. పిడీఎఫ్ తో సంబంధాలు ఉన్న నలుగురుని క్రైమ్ బ్రాంచ్ అరెస్టు చేసినట్లు థానే పోలీసులు తెలిపారు. నాసిక్ లో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ పోలీసులకు చెందిన ప్రత్యేక విభాగం ఢిల్లీలోని రోహిణి, నిజాముద్దీన్, జామియా, షహీన్ బాగ్, సెంట్రల్ ఢిల్లీ లో దాడులు చేపట్టింది. 30 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా జామియా విశ్వవిద్యాలయం పరిధిలో 144 సెక్షన్ విధించారు. అలానే పారా మిలటరీ బలగాలను మోహరించారు. తెలంగాణ, అస్సాంలోనూ పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
గత వారం పీఎఫ్ఐ నేతల ఇళ్లు, కార్యాలయాల్లో జరిపిన దాడుల్లో 100 మందికిపైగా పీఎఫ్ఐ సభ్యులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ సోదాల్లో ఎన్ఐఏ పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. ఈ సంస్థ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందనీ, లష్కరే తోయిబా, ఐసీస్, ఆల్ ఖైదా వంటి ఉగ్ర ముఠాలో చేరేలా యువతను ప్రేరేపిస్తొందని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. అంతే కాకుండా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హత్యకు కుట్ర పన్నిన విషయం వెలుగులోకి వచ్చింది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలే లక్ష్యంగా వ్యూహరచన చేసినట్లు మహారాష్ట్ర ఏటీఎస్ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. దసరా ఉత్సవాల్లో హింసకు పీఎఫ్ఐ భారీ కుట్ర పన్నినట్లు నిఘా వర్గాల దర్యాప్తులో వెల్లడైంది. తాజాగా జరిపిన దాడులతో 15 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న పీఎఫ్ఐకి చెందిన 200 మందికిపైగా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తొంది.