రాష్ట్రంలో అరాచకం ప్రబలిపోయిందని ,వైసిపి గూండాలు వీర విహారం చేస్తున్నారని,రాయలసీమ రౌడీలు ఎక్కడ చూసినా కనిపిస్తున్నారని ఒకటే వాపోతున్న తెలుగుదేశం పార్టీ ఇక నోరెత్తలేని ఘటన చోటుచేసుకుంది.
రాయలసీమకే చెందిన ఆ పార్టీ మాజీ శాసన సభ్యుడి కుమారు డొకడు తన గ్యాంగ్తో హైదరాబాద్లో వీరంగం మాడి ఒక సినిమా ఫైనాన్షియర్ ని కిడ్నాప్ చేసిన సంఘటన సంచలనం రేపింది.బాధితుని ఫిర్యాదు మేరకు మాజీ ఎమ్మెల్యే కుమారుడు అతని అనుచరులపై కేసు కూడా నమోదైంది. విషయానికొస్తే ..బంజారాహిల్స్ లో సినీ ఫక్కీ లో కిడ్నాప్ జరిగింది. కడప జిల్లాకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి కొడుకు కొండారెడ్డి హైదరాబాద్ లో ఈ కిడ్నాప్ చేశారు. సినీ డిస్ట్రీబ్యూటర్ శివ గణేష్ ను సినీ ఫక్కీలో కొండారెడ్డి గ్యాంగ్ కిడ్నాప్ చేసింది.
ఈ సందర్భంగా కొండారెడ్డి గ్యాంగ్ చెలరేగిపోయింది . అతని అనుచరులు వీరంగం సృష్టించారు. శివ గణేష్ కు తుపాకులు, కత్తులు చూపించి బెదిరించారు. శామీర్ పేట్ , కడప జిల్లాకు చెందిన భూమికి సంబంధించిన పత్రాల పై శివ గణేష్ చేత సంతకాలు చేయించుకుని వదిలివేశారు. దీంతో కిడ్నాప్ కు గురైన శివగణేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ పోలీసులు కొండారెడ్డి తో సహా పది మందిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా వెంటనే ట్విట్టర్లోనూ ఫేస్బుక్లోనూ దాన్ని పోస్టు చేసి వైసీపీపై విష ప్రచారం సాగిస్తున్న టిడిపి ఇప్పుడేం చేస్తుందో చూడాలి.సరైన సమయంలో ఈ అంశం వైసీపీకి ఆయుధంగా దొరికింది.టిడిపి కూడా సమర్థించుకోలేనంత పక్కాగా కేసు ఉంది.పైగా కేసు నమోదైంది హైదరాబాద్లో కాబట్టి చంద్రబాబు కూడా దాన్నేమీ మాఫీ చేయించలేరు.కాబట్టి రానున్న రోజుల్లో ఈ కిడ్నాప్ వ్యవహారం ఏపీలో రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలకు దారి తీసేదిగా ఉంది.