రాజకీయాలంటే రాజకీయాలే. ఇవి ఎవరిక అంతు చిక్కవు. ఇప్పుడు ఇలాంటి రాజకీయమే.. మిత్రపక్షం టీడీపీ-జనసేనలోనూ జరుగుతోంది. సాధారణంగా మిత్రులుగా ఉన్న పార్టీల మధ్య విభేదాలు రాకూడదు. పైగాకలివిడిగా పనిచేయాలని కూడా కోరుకుంటారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలోనూ టీడీపీ – జనసేన అధినేతలు చెబుతున్న మాట ఇదే. అయితే.. ఇప్పుడు మరో రాజకీయం కూడా తెరమీదికి వచ్చింది.
టీడీపీలో అసంతృప్తిగా ఉన్న నాయకుడు ఒకరు జనసేనలో చేరిపోతున్నారు. నిజమే. ఇదేమీ ఆశ్చర్యం కాదు. క్షేత్రస్థాయిలో దీనికి అటు చంద్రబాబు, ఇటు పవన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నిజానికి మిత్రపక్షాలుగా ఉన్నవారు.. కలిసి పనిచేయాలి లేదా.. తమను ఇష్టపడని నాయకులను వదిలేసుకోవాలి. అంతేకాదు.. జనసేనలో అసంతృప్తులను టీడీపీలోకి, టీడీపీలో అసంతృప్తులను జనసేనలోకి చేర్చుకోవడం ఏంటి? అనే ప్రశ్న సాధారణం.
కానీ, ఇది ఎన్నికల సమయం. పైగా మిత్రపక్షానికి వైసీపీ ఓటమి తప్పమరేమీ కనిపించడం లేదు. అందు కే.. ఎలాంటి వ్యూహాలనైనా వేయాలని నిర్నయించుకున్నారు. తాజాగా టీడీపీలో సీటు దక్కని నాయకు డు, అసంతృప్తితో రగిలిపోతున్న నాయకుడు పులివర్తి రామాంజనేయులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నాడు. అయితే.. ఆయనేమీ వైసీపీలోనో.. బీజేపీలోనో చేరడం లేదు. నేరుగా వెళ్లి జనసేన తలుపు తట్టాడు. వెంటనే పవన్ ఆయనకు స్వాగతం పలికారు.
ఇది జరిగింది.. జరుగుతోంది కూడా.. కీలకమైన భీమవరం నియోజకవర్గంలో. వచ్చే ఎన్నికల్లో ఈ సీటును టీడీపీ జనసేనకు కేటాయించింది. దీంతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే , గత ఎన్నికలలో ఓడిపోయిన పులివర్తి నాని.. రామాంజనేయులు.. టీడీపీపై గుస్సాగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయనకు జనసేన నుంచి పిలుపు వచ్చింది. అంతేకాదు.. భీమవరం అభ్యర్థిగా కూడా ప్రకటించేందుకు రెడీ అయింది. ఇక్కడితో కూడా ఆగిపోలేదు. జనసేన నాయకులు ఆయనకు సహకరించాలని కూడా పవన్ పిలుపునిచ్చారు. ఇదీ.. సంగతి!!