అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు బలంగా ఉండేది. రాయలసీమలో అనంతపురం టిడిపి పార్టీకి కంచుకోటగా వుండేది. కాగా గత ఎన్నికలలో అనంతపురం లోక్సభ పరిధిలో హిందూపురం నియోజకవర్గం మినహా మరో టిడిపి పార్టీ జెండా ఎగర లేదు. హిందూపురం నియోజకవర్గం నుండి బాలకృష్ణ మాత్రమే గెలవడం జరిగింది.
మిగతా చోట్ల టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. ఓటమి తర్వాత జిల్లాలో పార్టీ నేతలు సైలెంట్ గా ఉన్న సమయంలో చంద్రబాబు పార్టీ కమిటీలు ప్రకటించి నేతలలో ఊపు తెచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో గతంలో అనంతపురం జిల్లాలో మాజీ అధ్యక్షుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బి.కె పార్థసారథి కి హిందూపురం పార్లమెంటు పార్టీ బాధ్యతలు అప్పగించడం జరిగింది.
ఒకప్పుడు జిల్లాలో ఓ వెలుగు వెలిగిన నేపథ్యంలో పార్థసారథి ఆధ్వర్యంలో పార్టీ తిరుగులేకుండా పోరాటానికి రెడీ అవుతుందని టిడిపి హైకమాండ్ భావించింది. కాని హైకమాండ్ అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. హిందూపురం పార్లమెంటు నియోజకవర్గం లో ఉన్న చాలామంది నేతలు ఐక్యత గా ఉండటం లేదన్న టాక్ పార్టీ లో మీడియా సర్కిల్స్ లో వినపడుతోంది. ఎవరికివారు అన్నట్టు అంతా సోలో తరహాలో రాణిస్తున్నారట. ఇటీవల రైతుల కోసం చేసిన పోరాటంలో ఇదే తేలినట్లు, హిందూపురం పార్లమెంటు పరిధిలో ఉన్న నాయకుల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా ఉన్నట్లు బయటపడిందట. దీంతో టిడిపికి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో.. పార్టీకి భవిష్యత్తులో భారీగానే డ్యామేజ్ జరిగే అవకాశం ఉన్నట్లు ఏపీ రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తుంది.