Telangana Assembly: తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఇటీవల మృతి చెందిన శాసనసభ్యుల సంతాప తీర్మానాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సభలో ప్రవేశపెట్టారు. దివంగత మాజీ ఎమ్మెల్యేలు కుంజా బుజ్జి, అజ్మీరా చుందూలాల్, కేతిరి సాయిరెడ్డి, కుంజా బిక్షం, మేనేని సత్యనారాయణ, మాచర్ల జగన్నాధం, రాజయ్యగారి ముత్యంరెడ్డి, బొగ్గారపు సీతారామయ్య, చేకూరి కాశయ్య మృతికి శాసనసభ సంతాపం తెలిపింది. సంతాప తీర్మానాల అనంతరం శాసనసభ వాయిదా పడింది. సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్వీకర్ ప్రకటించారు. మరో వైపు శాసనమండలి లో ప్రొటెం స్పీకర్ హోదాలో భూపాల్ రెడ్డి సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు. అనంతరం మండలి కూడా సోమవారానికి వాయిదా పడింది.
అనంతరం అసెంబ్లీ స్పీకర్, మండలి ప్రొటెం చైర్మన్ అధ్యక్షతన బీఏసి సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో సీఎం కేసిఆర్, మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ, చీఫ్ విప్ లు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి బీజేపికి అహ్వానం అందలేదు. బీజేపీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో వెళ్లిపోయారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏయే అంశాలు చర్చించాలి, ఎంత సమయం కేటాయించాలన్న విషయాలపై నిర్ణయం తీసుకోనున్నారు. 25,26 తేదీల్లో సమావేశాలకు విరామం ప్రకటించి, తిరిగి 27వ తేదీ నుండి వచ్చే నెల 5వ తేదీ వరకూ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.