చోరీలు చేయడంలో ఎప్పటికప్పుడు కొత్త రూట్లు వెతుకుతున్నారు సీనియర్ క్రిమినల్స్. ఎవరూ ఊహించని రీతిలో పట్టపగలే అందరూ చూస్తుండగానే మాయ చేయడంలో వీరి రూటే సెపరేటు.
ఎప్పటికప్పుడు కొత్త టెక్నిక్స్ అమలు చేస్తూ… విజయవంతంగా హస్తలాఘవం ప్రదర్శిస్తున్న వీరిని చూస్తే.. ఎవరికైనా సరే దిమ్మదిరగాల్సిందే. నిజామాబాద్ పెళ్లిలో జరిగిన ఓ చోరీ గురించి ఆరా తీస్తూ.. టెక్నికల్ ఎవిడెన్స్ తో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు మతిపోయే రీతిలో షాకింగ్ వివరాలు బయటపడ్డాయి.
తీగలాగితే డొంక కదిలింది!
నిజామాబాద్ జిల్లాలోని డిచ్ పల్లి మండలం ధర్మారంగ్రామంలో గత డిసెంబర్ లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో 35 తులాల బంగారం నగల చోరీ కేసు సవాల్ గా తీసుకుని దర్యాప్తు చేయగా షాకింగ్ వివరాలు వెలుగులోకి వచ్చాయి. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసుల విచారణలో సీసీ కెమెరా ఫుటేజీలో పెళ్లికి వచ్చిన వారందరినీ గుర్తించారు. ఎంతకూ క్లూ దొరకలేదు. అయితే ఓ కొత్త మహిళ, ఆమె వెంట ఉన్న చిన్న పిల్లాడు అపరిచితుడిలా కనిపించారు. వారి కోసం మరిన్ని సీసీ ఫుటేజీలు పరిశీలించగా.. ఈ మహిళ చిన్నారిని తీసుకుని కారులో హడావుడిగా వెళ్లడం కనిపించడంతో.. ఆమె చోరీ చేసి ఉంటుందనే అనుమానం పెరిగింది. ఆమె వచ్చిన కారు ను ట్రేస్ చేసుకుంటూ వెళ్లగా.. వారు మధ్యప్రదేశ్ నేరస్తుల గ్యాంగ్ గా తేలింది. పాత నేరస్థుల వివరాలను వెతుక్కుంటూ మధ్యప్రదేశ్ సరిహద్దు గ్రామాలకు వెళ్లిన పోలీసులకు మరిన్ని షాకింగ్ వివరాలు తెలిశాయి.
ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతోన్న మధ్యప్రదేశ్ దొంగలు!
మధ్యప్రదేశ్ రాష్ట్రం పరిధిలోని రాజ్ఘడ్ జిల్లా సరిహద్దులో ఉన్న గులాఖఏరి, కడియ, సుల్ఖేరి గ్రామాల ముందు ఒకప్పటి స్టూవర్టుపురం దిగదుడుపే. టెక్నికల్ గా ఇంత నిఘా పెరిగినా.. ఈ మూడు గ్రామాలు ఇప్పటికీ దేశంలోని నలుదిక్కులా వెళ్లి చోరీలు చేయడమే వృత్తిగా పెట్టుకున్న కుటుంబాలు అనేకం కనిపిస్తాయి. దీని కోసం వారు ఎప్పటికప్పుడు స్పెషల్ ట్రైనింగ్స్ తీసుకుంటున్నట్లు మన పోలీసులు కళ్లారా చూశారు. ఈ ముఠా ఢిల్లీ, హర్యానాలకు చెందిన పది లేదా 12 ఏళ్ల లోపు పిల్లలను అద్దెకు తీసుకుని పెళ్లిళ్లకు హాజరవుతారు. పెద్ద పెద్ద ఫంక్షన్ హాళ్లలో జరిగే పెళ్లళ్లే వీరి టార్గెట్. ఎవరి వద్దనైనా ఖరీదైన ఆభరణాలు కనిపిస్తే.. వారిపై ఫోకస్ పెట్టి.. వెంటాడుతారు. వారికి తమ వెంట ఉన్న అద్దె పిల్లలతో చాక్లెట్లు లేదంటే ఐస్ క్రీముల్లో మత్తు మందు కలిపి ఇస్తారు. వారు స్పృహ తప్పి పడిపోగానే మొత్తం చోరీ చేసుకుని ఉడాయిస్తారు. నిజామాబాద్ లో ఈ మహిళ చోరీ చేస్తుండగా.. బయట కారులో ముగ్గురు ఆమె కోసం వేచి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని ఆ మూడు గ్రామాలకు చెందిన నిందితులను రౌండ్ చేసిన నిజామాబాద్ పోలీసులు వారిని ఇక్కడకు తీసుకొచ్చి అరెస్టు చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు.