హైదరాబాద్ బోయినపల్లి లో ప్రవీణ్ రావు సోదరుల కిడ్నాప్ వ్యవహారానికి సంబంధించిన కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం కల్గించిన విషయం తెలిసిందే. ఈ కేసులో బాధితులు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ బంధువులు కావడంతో పోలీసులు సీరియస్ గా తీసుకుని ఘటన జరిగిన 24గంటల వ్యవధిలోనే టీడీపీకి చెందిన ఏపి మాజీ మంత్రి భూమా అఖిలప్రియను అరెస్టు చేశారు. ఈ కేసులో అఖిలప్రియకు బెయిల్ లబించకుండా చేయడం కోసం పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు. పోలీసులు దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్ తో సికింద్రాబాద్ కోర్టు ఆమె బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది.
అఖిలప్రియ అనారోగ్యంతో బాధపడుతోందని, ఇప్పటికే కస్టడీ విచారణ కూడా పూర్తి అయినందున బెయిల్ మంజూరు చేయాలని ఆమె తరపు న్యాయవాది కోర్టులో కోరారు. అయితే ఆమెకు బెయిల్ ఇవ్వవద్దంటూ పోలీసులు కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. ఆమెపై అదనపు సెక్షన్ లు కూడా నమోదు చేస్తూ మెమో దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ జీవితకాలం శిక్షపడే కేసుల తమ కోర్టు పరిధిలోకి రావనీ, సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కేసులో అఖిలప్రియపై పోలీసులు కొత్తగా ఐపీసీ సెక్షన్ 395 (డెకాయిట్) యాడ్ చేయడంతో ఇది జీవితకాలం శిక్షపడే అవకాశం ఉన్న కేసు అని సికింద్రాబాద్ కోర్టు వ్యాఖ్యానించడంతో అఖిలప్రియపై నేరం రుజువు అయితే జీవిత ఖైదు తప్పదా అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంతకు ముందు కూడా బెయిల్ కోసం ధరఖాస్తు చేసిన సందర్భంలోనూ కోర్టు బెయిల్ ఇవ్వడానికి తిరస్కరించింది.
ఈ నెల 5వ తేదీ హైదరాబాద్ బోయినపల్లిలో ప్రవీణ్ రావు సోదరులను భూమా అఖిలప్రియ అనుచరులు కిడ్నాప్ చేశారు. ఘటన జరిగిన 24 గంటల్లోనే 6వ తేదీన అఖిలప్రియను పోలీసులు అరెస్టు చేసి చంచల్ గూడ జైలుకు తరలించారు. ఆ తరువాత కోర్టు అనుమతితో పోలీసులు ఆమెను మూడు రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. దాదాపు మూడు వందల ప్రశ్నలను సంధించి ఆమె నుండి సమాధానాలు రాబట్టారు. ఈ కేసులో ఇప్పటి వరకూ అఖిలప్రియతో కలిపి మొత్తం 18 మందిని అరెస్టు చేశారు.
ఈ కేసులో ఇంకా అఖిలప్రియ భర్త భార్గవరామ్, సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి, మరిది చంద్రహాస్, ఆడ పడుచు కిరణ్మయి పరారీలో ఉన్నారు. వారి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఈ కిడ్నాప్ పథక రచన కూకట్పల్లిలోని లోధా అపార్ట్ మెంట్ లో చేశారనీ, అఖిలప్రియ, భార్గవరామ్, జగత్ విఖ్యాత్ రెడ్డి, గుంటూరు శ్రీనులు కిడ్నాప్ ఎలా చేయాలి అనే దానిపై తర్ఫీదు ఇచ్చారనీ పోలీసుల విచారణలో తెలుసుకున్నారు. అయితే హైదరాబాద్ హఫీజ్పేటలోని 48 ఎకరాల భూమి వ్యవహారంలో ప్రవీణ్ రావు, అఖిలప్రియ కుటుంబాల మధ్య వివాదాలు చాలా కాలంగా ఉన్నాయనీ, ఈ వివాదాల నేపథ్యంలో ఈ కిడ్నాప్ జరిగింది అనేది ప్రధాన ఆరోపణ.