రాష్ట్రంలో ఒక్కశాతం ఓటు బ్యాంకు ఉన్న పార్టీ ఒకటి. అరశాతం ఉన్న పార్టీలు రెండు. ఇవన్నీ కలిసి.. చేతులు కలిపి.. రాష్ట్రంలో బలమైన పార్టీలుగా ఉన్న(వారు చెప్పినట్టే) వైసీపీ, టీడీపీలను అధికారంలోకి రాకుండా అడ్డుకుంటాయా? వారైతే అడ్డుకుంటా మనే చెబుతున్నారు. దీంతో ఈ మూడు పార్టీల వ్యవహారం ఆసక్తిగా మారింది. రాష్ట్రంలో వచ్చే ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకునేందుకు వామపక్షాలైన సీపీఎం, సీపీఐలు రెడీ అయ్యారు. ఈ క్రమంలో తాజాగా.. కాంగ్రెస్ చీఫ్ షర్మిలతోనూ పార్టీ రాష్ట్ర కార్యదర్శులు భేటీ అయ్యారు.
సుదీర్ఘంగా 3 గంటలకుపైగానే జరిగిన షర్మిల-వి. శ్రీనివాసరావు- కె. రామకృష్ణల చర్చల్లో తేలిందేంటంటే.. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేసి.. సీట్లు పంచేసుకుని.. వైసీపీ, టీడీపీ, బీజేపీలు అధికారంలోకి రాకుండా చేయాలని! ప్రజా పోరాటాలను బలంగా చేసి.. ప్రజల్లో మార్కులు వేయించుకోవాలని ఈ మూడు పార్టీలూ నిర్ణయించుకున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి బలమైన ప్రతిపక్షా లుగా మారాలని కూడా తీర్మానించుకున్నాయి. దీంతో వీరి వ్యూహం.. చేతులు కలపడం, భుజాలు రాసుకుని ముందుకు సాగడం ఎంత వరకు సక్సెస్ అవుతుందనేది ఆసక్తిగా మారింది.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని గమనిస్తే.. 2014కు ముందు బలంగా ఉన్న ఈ పార్టీ రాష్ట్ర విభజనతో తుడిచి పెట్టుకుపోయింది. గ్రామీణ ఓటు బ్యాంకు వైసీపీకి దాఖలు పడింది. ముందు ఈ విషయంపై దృస్టి పెట్టాల్సిన పార్టీ నాయకురాలు షర్మిల.. వైసీపీని తిట్టడం.. మధ్యమధ్యలో టీడీపీని గిల్లడం చేస్తున్నారు. దీనివల్ల ఓటు బ్యాంకు పెరగకపోగా.. సానుభూతి పవనాలు కూడా పోయే పరిస్థితి వచ్చింది. గత రెండు ఎన్నికల్లోనూ ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ పార్టీ తరఫున విజయం దక్కించుకున్న పరిస్థితి లేదు.
పైగా ఓటు బ్యాంకు దారుణంగా 1 అంతకన్నా తక్కువకే పడిపోయింది. కీలకమైన కంచుకోటగా ఉన్న ఉత్తరాంధ్ర, రాయల సీమల్లో కాంగ్రెస్ జెండా మోసే నాయకుడు కూడా లేరు. ఇక, వామపక్షాలది .. పెద్దగా చెప్పుకొనే పరిస్థితి ఏమీలేదు. ఈ రెండు పార్టీలు.. గత ఐదేళ్ల కాలంలో ప్రజాపోరాటాలు చేసింది కూడా ఏమీ లేదు. ముఖ్యంగా సీపీఎం అయితే.. వైసీపీతో లాలూచీ పడిందని.. పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఇక, సీపీఐ మాత్రం స్వతంత్రంగా చేసిన ఉద్యమం అంటూ ఒక్కటి కూడా లేదు.
నిన్నటి దాకా టీడీపీ పంచనే ఉన్న సీపీఐ.. ఇప్పుడు గళం మార్చింది. ఇక, ఈ పార్టీలకు అరశాతం కూడా ఓటు బ్యాంకు ఉన్నా.. అది ఎక్కువే. ఇలాంటి సమయంలో పార్టీలను బలోపేతం చేసుకోవడం మానేసి.. ఒక్క శాతం పార్టీతో అరశాతం పార్టీలు చేతులు కలిపి.. ప్రభుత్వాలను కూల్చేస్తామని చెప్పడం రాజకీయాల్లో క్యామెడీగా ఉందని అంటున్నారు పరిశీలకులు.