ఇప్పటి వరకు వైఎస్ షర్మిల ఉన్న ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్.. ఇక నుంచి `కామ్రెడ్ షర్మిల`గా మారను న్నారు. అదేంటి అనుకుంటున్నారా? ఔను.. ఏపీలో ఇప్పటికే టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తు రాజకీయాలు ఖాయమైన దరిమిలా.. కమ్యూనిస్టు పార్టీలు.. సీపీఐ, సీపీఎంలు యూటర్న్ తీసుకున్నాయి. నిజానికి బీజేపీ లేకపోతే.. టీడీపీ-జనసేన మిత్రపక్షంతో కమ్యూనిస్టులు కలవాలని అనుకున్నారు. ముఖ్యంగా సీపీఐ ఈ విషయంలో ఒక నిర్ణయానికి కూడా వచ్చింది.
అయితే.. వచ్చే ఎన్నికలు కీలకంగా మారిన నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ మద్దతు తమకు అవసరమని .. చంద్రబాబు తలపోస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన బీజేపీ కోసం వెయిట్ చేస్తున్నారు. దీనిని ఎవరూ తప్పుపట్టాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో ఏ అవసరం ఎటు నుంచి ఎలా వస్తుందో చెప్పలేం. పైగా శాశ్వత మిత్రులు, శత్రువులు రాజకీయాల్లో ఉండే అవకాశం లేదు. అయితే.. ఇప్పటి వరకు టీడీపీనే నమ్ముకున్నామని చెబుతున్న సీపీఐ మాత్రం కొంత నిరాశ వ్యక్తం చేసింది.
కానీ, రాష్ట్రంలోని పరిస్థితుల నేపథ్యంలో కమ్యూనిస్టులు సైతం.. టీడీపీ నిర్ణయాన్ని వ్యతిరేకించే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో వారు యూటర్న్ తీసుకున్నారు. వచ్చే ఏపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి ముందుకు సాగాలని దాదాపు ఒక నిర్ణయానికి వచ్చేశారు. తాజాగా వైఎస్ షర్మిల గురువారం చేపట్టిన మెగా డీఎస్సీ ఆందోళనలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు. దీనిని బట్టి వైఎస్ షర్మిల వెంట ఉంటామని కమ్యూనిస్ట్ నేతలు స్పష్టం చేసినట్టు అయింది.
ఇక, ఇప్పటికే జాతీయ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఇండియా కూటమిలో కమ్యూనిస్టు పార్టీలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీలో కలిసి నడిస్త.. బాగుంటుందని నిర్ణయించినట్టు సమాచారం. దీనిపై వైఎస్ షర్మిలతో సీపీఐ నేత రామకృష్ణ, సీపీఎం నేత శ్రీనివాస రావు చర్చలకు సైతం రెడీ అయ్యారు. ఒకటి రెండు రోజుల్లో.. ఈ పార్టీల మధ్య పొత్తు పొడిచే అవకాశం ఉంది.
కాంగ్రెస్తో ముందుకు సాగితే.. కమ్యూనిస్టులకు కూడా కావాల్సినన్ని సీట్లు దక్కే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరి ఏమేరకు సక్సెస్ అవుతారో చూడాలి. చిత్రం ఏంటంటే.. కాంగ్రెస్, కమ్యూనిస్టులకు ఏపీలో గత 10 ఏళ్లుగా ఒక్క ఎమ్మెల్యే లేకపోవడం గమనార్హం.