ప్రస్తుత టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ యాక్టివ్ అయ్యారు. ఎన్నికల్లో పోటీ చేయాలన్న కోరిక ఇప్పుడు ఆయన మనసులో చిగురించిందనే అంటున్నారు. వాస్తవానికి ఎప్పుడోనే ఎన్నికల్లో పోటీ చేయాలని టీడీపీ హైకమాండ్ అడిగినా ఆయనపెద్దగా ఆసక్తి చూపించలేదు. ఎందుకంటే ఆయన మనసంతా విజయవాడ సెంట్రల్ సీటు మీదే ఉంది. అయితే అక్కడ నుంచి టీడీపీకి మాజీ ఎమ్మెల్యే, ఫైర్బ్రాండ్ లీడర్ బొండా ఉమామహేశ్వరరావు ఉన్నారు.
అక్కడ సీటు రాదన్న విషయం అర్థమయ్యే టీడీపీ వాళ్లు పోటీ చేయమని అడిగినా రాధా నో చెప్పారు. అయితే ఇప్పుడ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన వెంటనే రాధా హఠాత్తుగా జనసేన నేతలతో భేటీ అవుతున్నారు. తెనాలిలో నాదెండ్ల మనోహర్ తో తర్వాత మచిలీపట్నం జనసేన పార్టీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరితో సమావేశం అయ్యారు. రాధా మనస్సులో ఏముందున్నది తెలియదు కాని ఆయన ఎన్నికల్లో పోటీకి మొగ్గు చూపుతున్నారన్న ప్రచారం జరుగుతోంది.
ఆయన జనసేన నుంచి పోటీ చేసేందుకు నియోజకవర్గాన్ని కూడా చూసుకున్నట్టు చెపుతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించారు. ఆ నియోజకవర్గానికి ఇంకా జనసేన పార్టీ తమ అభ్యర్థిని ఖరారు చేయలేదు. టీడీపీ నేత మండలి బుద్దప్రసాద్ ను జనసేన తరపున పోటీ చేయిస్తారని కొందరు అంటుంటే.. మరి కొందరు కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షులు బండ్రెడ్రి రామకృష్ణ పేరు కూడా వినపడుతోంది.
ఇలాంటి టైంలో జనసేన నుంచి అవనిగడ్డలో అనూహ్యంగా వంగవీటి రాధా పేరు తెరమీదకు వస్తోంది. రాధా ఖచ్చితంగా పోటీ చేయాలని అనుకుంటే ఆయనకు అవనిగడ్డ సీటు ఇచ్చేందుకు జనసేన కూడా సుముఖంగానే ఉందని అంటున్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచన రాధాకు వస్తే అదేదో టీడీపీ నుంచే పోటీ చేస్తే సరిపోయేది కదా.. మళ్లీ ఇప్పుడు ఎందుకు జనసేన లోకి వెళ్లడం.. ఆ పార్టీ నుంచి ఎందుకు ? పోటీ చేయడం అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి.