కడప జిల్లాకు చెందిన సీఎం రమేష్ మామూలు డ్రామాలు ఆడటం లేదు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకంగా రాజకీయాల్లో రమేష్ పేరు తెచ్చుకున్నారు. 2014 ఎన్నికల టైంలో రాయలసీమ జిల్లాల్లో చక్రం తిప్పి తనకు ఇష్టం వచ్చినవారికి సీట్లు ఇప్పించుకుని పార్టీ చాలా నియోజకవర్గాల్లో ఓడిపోయేందుకు రమేష్ కారణమయ్యారన్న విమర్శలు ఉన్నాయి. ప్రొద్దుటూరులో నాడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న లింగారెడ్డిని పక్కనపెట్టి.. వరదరాజుల రెడ్డికి సీటు ఇస్తే ఆయన చిత్తుగా ఓడిపోయారు. పార్టీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలలో రాయలసీమలో సీఎం రమేష్ ఆడింది ఆట.. పాడింది పాటగా మారింది.
ఆయన తీరుతోనే సీమ జిల్లాలలో పార్టీ చాలావరకు బ్రష్టు పట్టిపోయి.. మూడు సీట్లకు పరిమితమైందని.. తెలుగు తమ్ముళ్లే వాపోతుంటారు. 2019 ఎన్నికలలో పార్టీ ఘోరంగా ఓడిపోయిన వెంటనే సీఎం రమేష్ బీజేపీ కండువా ఒప్పుకున్నారు. అప్పటివరకు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడుగా ఉండి.. ఆ వెంటనే కండువా మార్చేయటం రమేష్కు చెల్లింది. బీజేపీలో ఉంటూ తన వ్యాపారాలు చక్కపెట్టుకుంటూ వస్తున్న రమేష్.. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలలో ఎలాగైనా పోటీ చేసి ఎంపీగా విజయం సాధించాలని కోరుతున్నారు.
మామూలుగా రమేష్కు బీజేపీ వాళ్లు జీవితాంతంలో ఎప్పుడు కూడా రాజ్యసభ ఇచ్చే సీను ఉండదు. ఇప్పుడు టీడీపీతో పొత్తు ఉండటంతో ఎలాగైనా ఒక పార్లమెంటు సీటు దక్కించుకొని ఎంపీగా విజయం సాధించి.. తన వ్యాపారాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తన సొంత జిల్లా కడపలో పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రావు. అందుకే ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం అనకాపల్లి పార్లమెంటు స్థానాలపై గురిపెట్టి రాజకీయం చేస్తూ వస్తున్నారు. గత కొద్దిరోజులుగా తాను విశాఖపట్నం ఎంపీ సీటు అడిగానని ప్రచారాన్ని ఊదరగొట్టుకుంటున్నారు.
అయితే విశాఖ సీటును టీడీపీ వదులుకునేందుకు సిద్ధంగా లేదు. అక్కడ గత ఎన్నికలలో ఓడిన బాలయ్య చిన్నల్లుడు భరత్.. మరోసారి పోటీ చేస్తున్నారు. ఒకవేళ బీజేపీకి ఇచ్చిన జీవీఎల్ నరసింహారావు లాంటి వాళ్ళు ఎప్పటినుంచో ట్రై చేస్తున్నారు. విశాఖ సీటు బీజేపి తీసుకుంటే ఆ పార్టీ జాతీయ నాయకత్వం జీవీఎల్కు సీటు ఇస్తుంది అనటంలో సందేహం లేదు. ఇక విశాఖలో ఎలాగూ సీటు రాదని డిసైడ్ అయిన రమేష్.. అనకాపల్లి పై దృష్టి పెట్టారు.
అనకాపల్లి పార్లమెంటు పరిధిలో కొప్పుల వెలమ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. అయితే ఓసి వెలమ అయిన రమేష్ అనకాపల్లి సీటు.. పొత్తులో తనకే వస్తుంది అని ప్రకటించేసుకుంటున్నారు. ఒకసారిగా అనకాపల్లిలో సీఎం రమేష్ అభిమానులు పేరుతో ప్లెక్సీలు కట్టేశారు. రమేష్ బీజేపి, టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి అని కూడా రాసి మరి రాజకీయ చర్చకు తెర తీశారు. మరోవైపు అనకాపల్లి ఎంపీ సీటు విషయంలో టీడీపీలోని ఆశావాహులు ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. వారు ఎక్కడా తగ్గటం లేదు.
పైగా సీఎం రమేష్ నాన్ లోకల్ ఆయన. ఎక్కడో రాయలసీమ వ్యక్తి. ఒకవేళ ఇక్కడ బీజేపీ నుంచి పోటీ చేయాలంటే జీవీఎల్ తో పాటు మాజీ ఎమ్మెల్సీ మాధవ్ లాంటి నేతలు ఉన్నారు. వారిని కాదని రమేష్కు సీటు ఇచ్చే అంత సీన్ లేదు. కానీ రమేష్ మాత్రం తనదైన స్టైల్ లో మామూలు డ్రామాలు ఆడటం లేదన్న విమర్శలు అయితే బీజేపీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి.