దేశంలో ఇప్పటికీ చాలా మంది విద్యార్థులు సరైన ఆదరణ లేక చదువుకోవడం మానేస్తున్నారు. కొందరు స్వశక్తితో ఎదుగుతూ విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు. ఓవైపు పార్ట్ టైం పనులు చేస్తూనే.. మరోవైపు విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిలో ఢిల్లీకి చెందిన 17 ఏళ్ల పరమేశ్వర్ కూడా ఒకడు. ఇతను ఆ నగరంలోని ఓ మురికివాడలో నివాసం ఉంటున్నాడు. కటిక పేదరికం అనుభవిస్తున్నాడు. అయినా.. సీబీఎస్ఈ పరీక్షల్లో మెరుగైన ఉత్తీర్ణత సాధించాడు.
పరమేశ్వర్కు కుటుంబం ఉంది. సోదరులు కూడా ఉన్నారు. కానీ వారికి సొంత కుటుంబాలు ఉన్నాయి. అయినా వారికి కూడా స్థిరమైన ఆదాయం లేదు. మరోవైపు పరమేశ్వర్ తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో అతను కుటుంబ భారాన్ని భుజాన వేసుకున్నాడు. అక్కడే ఓ కార్ల వాషింగ్ షెడ్డులో పనిచేయడం మొదలు పెట్టాడు. నిత్యం ఉదయాన్నే 4 గంటలకు లేస్తాడు. 2 నుంచి రెండున్నర గంటల పాటు పని ఉంటుంది. తరువాత స్కూల్కు వెళ్తాడు. వారంలో 6 రోజుల పాటు పని ఉంటుంది. రోజుకు 10కి పైగా కార్లను వాష్ చేస్తాడు. నెలకు రూ.3వేల వరకు అతనికి ఇస్తారు. దాంతోనే అతను ఓవైపు తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మరోవైపు విద్యాభ్యాసం కొనసాగిస్తున్నాడు.
ఇక చలికాలంలో అయితే పరమేశ్వర్ పడే అవస్థ అంతా ఇంతా కాదు. నీటికి చేతి వేళ్లు గడ్డకట్టుకుపోతాయి. అయినా అతను పనిచేయడం ఆపలేదు. ఇక మార్చి నెలలో తన తండ్రి హాస్పిటల్ పాలయ్యాడు. అయినప్పటికీ అతను ఓ వైపు తండ్రిని హాస్పిటల్లో చూసుకుంటూనే మరోవైపు కష్టపడి చదివి పరీక్షలు రాశాడు. తాజాగా ప్రకటించిన సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో ఏకంగా 91.7 శాతం మార్కులు సాధించాడు. తన జీవిత లక్ష్యం ఏమిటో మీడియాకు అతను తెలియజేయలేదు. అయినప్పటికీ అతని పట్టుదల చూస్తుంటే తప్పకుండా అతను ఉన్నత స్థానాలకు చేరుకుంటాడని మనకు అర్థమవుతుంది.