ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోమారు కీలక వ్యాఖ్యలు చేశారు.
తన పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువ అయిన సమయంలో గమనించిన వివిధ అంశాలను తాను ఇప్పుడు ఏ విధంగా నెరవేర్చగలననే విషయంలో సీరియస్గా దృష్టిపెట్టిన ఆయన తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. పశుసంవర్థక, మత్స్యశాఖ సమీక్షా సమావేశంలో అధికారులతో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆసక్తికర కామెంట్లు చేశారు.
వాళ్లతో ఏం మాట్లాడారంటే….
అమరావతిలో నిర్వహించిన పశుసంవర్థక, మత్స్యశాఖ సమీక్షా సమావేశంలో అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులు, ప్రజా ప్రతినిధులతో తన మనోభావాలు పంచుకున్నారు. ప్రతి రంగంలోకూడా మనకో విజన్ ఉండాలి అని కోరారు. అరకొర ఆలోచనలు వద్దని పేర్కొన్న ఆయన మంచి విజన్తోనే సమూల పరిష్కారాలు వస్తాయని స్పష్టం చేశారు. ఖర్చు గురించి ఆలోచనలు వద్దని ఏపీ సీఎం వైఎస్ .జగన్ స్పష్టం చేశారు. ఏ ఆలోచన చేసినా పూర్థిస్థాయిలో పరిష్కారాలు రావాలి, అందరికీ మేలు జరగాలి అని స్పష్టం చేశారు.
నా కళ్లతో చూశాను….
పాదయాత్రలో నా కళ్లతో చూసిన పరిస్థితులను మార్పు చేయాలనే ఉద్దేశంతోనే పనిచేస్తున్నానని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. “దేవుడు, ప్రజలు ఆశీర్వదించి ఈ స్థానంలో కూర్చోబెట్టారు. అందరికీ మంచి చేయాలనే దిశగా అడుగులేస్తున్నాం. విజన్ ఏంటనేది ముందు నిర్దేశించుకోవాలి. అరకొరగా ఆలోచనలు చేయకూడదు. ఈ దిశలో డబ్బు ఖర్చు గురించి పట్టించుకోవద్దు. పెద్ద ఆలోచనలు చేయడంవల్లే విప్లవాత్మక మార్పులు తీసుకు రాగలుగుతున్నాం. వ్యవసాయం, విద్య, వైద్యం సహా అనేక రంగాల్లో గొప్ప నిర్ణయాలను అమలు చేస్తున్నాం` అని ఏపీ సీఎం స్పష్టం చేశారు.
చాలా బాధ పడే పరిస్థితి..
స్వాతంత్య్రం వచ్చిన ఇన్నాళ్ల తర్వాత కూడా మనం నాణ్యమైన విద్య అందించలేని పరిస్థితిలో ఉన్నామంటే..చాలా విచారకరమని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. “ఈ పరిస్థితులను మార్చబోతున్నాం. ప్రభుత్వ స్కూళ్లలో నాడు-నేడు పనులు చేపట్టాం. ఇంగ్లిషు మీడియం చదువులు తీసుకు వస్తున్నాం. జీఈఆర్ రేషియోను మార్చబోతున్నాం. గతంలో ఎప్పుడూ కూడా ఇలాంటి ఆలోచనలు చేయలేదు. కొత్తగా 16 బోధనాసుపత్రులు, మొత్తంగా 27 బోధనాసుపత్రులు రాష్ట్రంలో ఉండబోతున్నాయి. ప్రతి రంగంలోనూ గణనీయమైన మార్పులు తీసుకు వస్తున్నాం. మంచి చేయాలని, మంచి పనులు చేయాలని గట్టిగా అనుకుంటే, అంకిత భావంతో ముందుకు వెళ్తే.. దేవుడు తప్పకుండా సహాయపడతాడు“ అని స్పష్టం చేశారు.
పూర్తి విప్లవాత్మక మార్పులు
వ్యవసాయ రంగంలో పూర్తిస్థాయి విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తున్నామని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. “10వేలకు పైగా ఆర్బీకే కేంద్రాలు ఉన్నాయంటే.. అదొక విజన్ వల్ల వచ్చాయి. వ్యవసాయరంగంలో నాణ్యతను పెంచే ఆలోచన మార్గంలోనే ఆర్బీకేలు వచ్చాయి. విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు తదితర అంశాల్లో క్వాలిటీని తీసుకురావాలని, రైతులను మోసం చేసి దళారీలు బాగుపడే పరిస్థితుల నుంచి వారిని బయటకు తీసుకు రావాలని ఆలోచన చేసి వీటిని ప్రారంభించాం. “అని ప్రకటించారు.
దగా జరిగే చాన్స్ ఉండొద్దు
రైతును దగా కానీయకుండా, నాణ్యమైన సేవలను రైతు ఊర్లోనే, అతని గడపవద్దకే చేర్చాలన్న ఆలోచనతోనే ఆర్బీకేలు ఏర్పాటయ్యాయని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. “గ్రామాల్లోనే రెవిన్యూ, అగ్రికల్చర్ అసిస్టెంట్లు, ఆక్వా అసిస్టెంట్లు, సర్వేయర్లు ఉన్నారు. బీమా కావాలన్నా, పంట రుణం కావాలన్నా, పంట కొనుగోలు ప్రభుత్వం చేయాలన్నా.. ఇ– క్రాపింగ్ అనేది చాలా ముఖ్యమైన విషయం. అలాగే పంటలకు కనీస గిట్టుబాటు ధర కల్పించే దిశగా విత్తనం వేసేముందే.. ఆర్బీకేల్లో వివిధ పంటలకు కనీస గిట్టుబాటు ధరలను పోస్టర్ ద్వారా ఆర్బీకేల్లో పెడుతున్నాం:అంతకన్నా తక్కువ రేటుకు అమ్ముకునే పరిస్థితికి రాకూడదనే ఉద్దేశంతోనే ఆర్బీకేలు పెట్టాం. ఇవికాక రైతులకు సూచనలు, సలహాలు ఇస్తాయి. ఏ పంటలు వేయాలి? ఏవి వేస్తే మంచి ధరలువచ్చే అవకాశం ఉంటుందన్న దానిపై సూచనలు, సలహాలు ఇస్తుంది. దీనికోసం జిల్లా స్థాయిలో , మండల స్థాయిలో సలహా మండళ్లను ఏర్పాటు చేస్తున్నాం:రైతులతో ఇంటరాక్ట్కావడానికి కూడా ఆర్బీకేలు పనిచేస్తున్నాయి“ అని సీఎం జగన్ తెలిపారు.
రైతుల విషయంలో ఏం జరిగిందంటే…
రైతుకు గిట్టుబాటు ధర కల్పించడానికి ఇ– మార్కెటింగ్ ఫ్లాట్ఫాం ఏర్పాటు చేసుకున్నామని ఏపీ సీఎం ప్రకటించారు. “రైతులకు ప్రత్యామ్నాయ మార్కెట్ అవకాశాలను కల్పించడంలో భాగంగా ఇది చేపట్టాం. ఒకవేళ రైతు నష్టపోయే పరిస్థితి వస్తే.. ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. దాదాపు రూ.3200 కోట్లు ధరల స్థిరీకరణ కోసం ఖర్చు చేశాం. చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. అక్కడ నుంచి గోడౌన్లు, ప్రీ ప్రాసెసింగ్, వ్యవసాయ పరికరాలు, అన్నీకూడా ఏర్పాటు చేయబోతున్నాం. మండలాల్లో కోల్డ్స్టోరేజీలు రాబోతున్నాయి. వీటన్నింటికోసం దాదాపు రూ.4వేల కోట్లు ఖర్చు చేయబోతున్నాం. జనతా బజార్లునూ తీసుకు వస్తున్నాం. ప్రతి గ్రామంలోనూ, ప్రతి వార్డులోనూ తీసుకు రాబోతున్నాం. రైతుల వద్ద నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన ఉత్పత్తులను సరసమైన ధరలకు వినియోగదారులకు అందుబాటులోకి తీసుకు వస్తున్నాం. వాల్యూ ఎడిషన్ కోసం ప్రీ ప్రాససింగ్, ప్రాససింగ్ విధానాలు తీసుకు వస్తున్నాం. ఇప్పటికే వ్యవసాయ రంగంలో ఇలాంటి మార్పులు కోసం రూ.4వేల కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధం అయ్యాం. ఒక విజన్లో భాగంగా ఇవన్నీకూడా ఏర్పాటయ్యాయి.“ అని ప్రకటించారు.