KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్గా ఆలోచించాల్సిన విషయం ఇది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి రోజురోజుకు ప్రమాదకరంగా మారుతున్న దృష్ట్యా మున్సిపల్ ఎన్నికలను నిర్వహించి ప్రజల ప్రాణాలను బలి తీసుకోవద్దని, వెంటనే మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేయాలని విపక్షాలు కోరుతున్నాయి. ఇదే విషయాన్ని ప్రతిపక్ష తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్, తెలంగాణ బీజేపీ కోరారు.
కాంగ్రెస్ నేరుగా లేఖ
ఎన్నికల వాయిదా విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్కు లేఖ రాసింది. మే 1 వరకు రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలుచేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరుణంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని కమిటీ పేర్కొంది. రాజకీయ పార్టీలు, ఉద్యోగులు, ఇతర పార్టీల ప్రతినిధుల అభిప్రాయం తీసుకోకుండానే ఎన్నికల సంఘం ఏకపక్షంగా నోటిఫికేషన్ విడుదల చేసిందని అభిప్రాయపడింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ నేతలు తెలిపారు.
భగ్గుమంటున్న బీజేపీ
ప్రభుత్వానికి ఎన్నికల మీదున్న సోయి ప్రజారోగ్యం మీద లేదన్నారు బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చ అధ్యక్షుడు లక్ష్మణ్. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయన్నారు. మొండిగా ఎన్నికలకు వెళ్తే తాము కూడా పోటీ చేస్తామన్నారు. బీజేపీకి ఎన్నికల కంటే కరోనా నియంత్రణే ముఖ్యమన్నారు. ఈ ఎన్నికలు తమకు ప్రతిష్టాత్మకం కాదన్నారు. 100 మంది టెస్టింగ్ వెళితే 40 మందికి పాజిటివ్ వస్తుందన్నారు. ప్రభుత్వానికి ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాల మీద లేదన్నారు. భేషాజాలకు వెళ్లకుండా రాష్ట్ర ప్రజల క్షేమం దృష్ట్యా మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు వాయిదా వేయాలన్నారు.