తెలంగాణలో నూతన పీసీసీ అధ్యక్షుడి నియామకం వాయిదా పడింది.త్వరలో జరగనున్న నాగార్జునసాగర్ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ అధిష్టానవర్గం కొత్త పీసీసీ అధ్యక్షుడి నియామకాన్ని తాత్కాలికంగా వాయిదా వేసింది.అదే సమయంలో నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు పార్టీ అభ్యర్థినీ ఖరారు చేసింది. సాగర్పై పట్టున్న సీనియర్ నేత జానారెడ్డినే పోటీ చేస్తారని ప్రకటించింది.
జాగ్రత్త పడ్డ కాంగ్రెస్ అధిష్టానవర్గం!
త్వరలోనే నాగార్జునసాగర్ ఉప ఎన్నిక జరుగనుంది. ఈ ఉప ఎన్నిక కోసం అన్ని పార్టీలు రెడీ అవుతున్నాయి. సాగర్ సీటును నిలబెట్టుకునేందుకు టీఆర్ఎస్ వ్యూహాలు రూపొందిస్తుండగా…. బీజేపీ పాగా వేసేందుకు ఎత్తుగడలు పన్నుతోంది. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా నాగార్జునసాగర్ సీటును దక్కించుకునేందుకు పావులు కదుపుతోంది.అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పిసిసికి కొత్త అధ్యక్షుడిని గనుక నియమిస్తే అది పార్టీ విజయావకాశాలను దెబ్బ తీసే ప్రమాదం ఉందని కాంగ్రెస్ హైకమాండ్ పసిగట్టింది.పిసిసి అధ్యక్ష పదవికి మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు రేవంత్రెడ్డితో పాటు నల్గొండ జిల్లాకు చెందిన భువనగిరి పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పోటీ పడుతున్నారు.నాగార్జున సాగర్ నల్లగొండ జిల్లాలోనే ఉంది.ఇప్పుడు గనుక కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అధ్యక్ష పదవి ఇవ్వకపోయినా మరొకరిని నియమించినా ఆ ఎఫెక్ట్ సాగర్ ఉప ఎన్నిక మీద పడటం ఖాయం.పైగా ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ నల్లగొండ జిల్లాలో టాప్ లీడర్.
ఈ పరిస్థితుల్లో ఆయన కోరిక మీదే ఉత్తమ్ కుమార్ ను పదవి నుంచి తప్పించినప్పటికీ ఆయన వర్గీయులు కూడా హర్ట్ అయ్యే అవకాశం లేకపోలేదు.వీరంతా వ్యతిరేకంగా చేస్తే సాగర్లో కాంగ్రెస్ మళ్లీ ఓడిపోయే ప్రమాదం ఉంది.అంతేగాకుండా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జానారెడ్డి కూడా నాగార్జునసాగర్ ఉప ఎన్నిక జరిగే వరకు పీసీసీ నూతన అధ్యక్షుడి ఎన్నిక వాయిదా వేయాలంటూ కాంగ్రెస్ హైకమాండ్ను కోరారు. ఎన్నికల వేళ పీసీసీ అధ్యక్షుడిని ప్రకటిస్తే పార్టీ నేతల మధ్య విభేదాలు తలెత్తుతాయని.. అందుకే రెండు నెలలు వాయిదా వేయాలని కోరారు. అధిష్టానం కూడా జానారెడ్డి సూచనను పరిగణలోకి తీసుకుంది.పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ ఇదే విషయమై కీలక నేతలతో సంప్రదింపులు జరిపారు. వారు కూడా జానారెడ్డి సూచనతో ఏకీభవించారు. దీంతో పీసీసీ కొత్త అధ్యక్షుడి ఎన్నికను తాత్కాలికంగా వాయిదా వేస్తూ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది.
అప్పటి వరకు పాత కమిటీనే!
నాగార్జునసాగర్ ఉప ఎన్నికతోపాటు… ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాతే కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని మాణిక్కం ఠాగూర్ వెల్లడించారు. అప్పటి వరకు ప్రస్తుత పీసీసీనే కొనసాగుతుందని స్పష్టం చేశారు. పీసీసీ చీఫ్గా ఉత్తమ్కుమార్రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్లుగా రేవంత్రెడ్డి, పొన్నం ప్రభాకర్ కొనసాగుతారని ఆయన తెలిపారు.
ఈసారి మాత్రం కాంగ్రెస్సే ఫస్ట్!
అందరికంటే ముందే కాంగ్రెస్ నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు తన అభ్యర్థిని ప్రకటించేసింది. నాగార్జునసాగర్లో పట్టున్న జానారెడ్డినే అభ్యర్థిగా డిక్లేర్ చేసింది. సాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున సీనియర్నేత జానారెడ్డి పోటీ చేస్తారని… రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్ ప్రకటించారు. ఇందుకు జానారెడ్డి కూడా సుముఖత వ్యక్తం చేశారని తెలిపారు.సమిష్టిగా పనిచేసి సాగర్లో జానారెడ్డిని గెలిపించాలని పార్టీ నేతలను మాణిక్కం ఠాగూర్ ఆదేశించారు.2014 లో నాగార్జున సాగర్ నుంచి జానారెడ్డి గెలుపొందారు.మొన్నటి ఎన్నికల్లో ప్రత్యేక పరిస్థితుల్లో ఓడిపోయారు.అయితే ఇప్పటికీ నాగార్జునసాగర్లో జానారెడ్డి మంచి హోల్డ్ ఉంది.